బాన్సువాడ, జనవరి 26: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపల్తోపాటు అన్ని గ్రామాల్లో ఎన్నికల్లో నిలబడిన ప్రతిఒక్కరినీ కూర్చుండబెట్టి గెలిపిస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను చేసిన పనులను సమయం లేక చెప్పుకోలేకపోయానని, ఇప్పుడు ప్రతి గల్లీ, ఇంటికి వెళ్లి చెబుతానని పేర్కొన్నారు.ప్రజలను మెప్పించి గెలిపిస్తానని నాయకులకు భరోసానిచ్చారు. బాన్సువాడలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. బాన్సువాడ మున్సిపాలిటీని ఒంటిచేత్తో గెలిపిస్తానని, అదే విధంగా సర్పంచులను కూడా భారీ మెజార్టీతో గెలిపించి తీరుతానని ధీమా వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉండగా..బాన్సువాడ నియోజకవర్గానికి 24 వేల ఇండ్లు మంజూరైనట్లు అధికారికంగా లెక్కలు ఉన్నాయని తెలిపారు. నియోజకవర్గంలో 24 వేల ఇండ్లు నిర్మిస్తే ..ఇప్పుడు ఇల్లు ఎవరికీ అవసరం ఉండదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ బడానాయకులే ఇండ్లను రాసుకొని పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు. అలాంటి బడానాయకుల మాటలు విని ఇండ్లు కట్టకున్నా బిల్లులు మంజూరుచేసిన సుమారు 250 మంది ప్రభుత్వ ఉద్యోగులను బర్తరఫ్ చేశారని తెలిపారు. 24వేల ఇండ్లు నిర్మిస్తే నియోజకవర్గంలో ఇండ్లు లేని వారు ఉండేవారా అని ప్రశ్నించారు. నాడు దొంగలు దొంగలు కలిసి ఇండ్లు పంచుకున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చిందంటూ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. సుమారు 14 చోట్ల వెయ్యి, పదిహేను వందల ఓట్లతో ఓటమి చెందారని, అవన్నీ కలిపితే తమకు 54 సీట్లు వచ్చేవని, తామే అధికారంలో ఉండేవారమని పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంలో రూ.5లక్షల్లో రూ.లక్ష తీసుకుంటున్నారంటూ బద్నాం చేస్తున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని అన్నారు. ఇండ్ల నిర్మాణంలో బిల్లుల వివరాలను గతంలోనే వివరించినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.