నస్రుల్లాబాద్, మార్చి 11: నియోజకవర్గంలో ఎకరం కూడా ఎండిపోకుండా పంటలను కాపాడుతామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బీర్కూర్ నల్లజేరు చెరువును సోమవా రం ఆయన పరిశీలించారు. తూములో చెత్త ఇరుక్కొని పంట పొలాలకు నీరందడం లేదని స్థానిక నాయకులు ఎమ్మెల్యే పోచారం సమాచారం ఇవ్వడంతో ఆయన చెరువు తూమును పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడారు. నీటి అడుగున చెత్త, ఇతర అడ్డంకులను శుభ్రం చేసేందుకు నిపుణులను పిలిపించి మంగళవారం సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ… నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని అలీసాగర్ వరకు ఈ యాసంగిలో 1.30లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక తయారు చేశామన్నారు. ఏడు విడుతలుగా సాగునీరు అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరో విడుత నీటి విడుదల కొనసాగుతుందన్నారు. బీర్కూర్ నల్లజేరు చెరువు కింద 650 ఎకరాల ఆయకట్టు ఉన్నదని తెలిపారు. ఆయన వెంట ఎంపీటీసీ సభ్యుడు సందీప్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఆరీఫ్, నాయకులు ఉన్నారు.