బాన్సువాడ, ఫిబ్రవరి 7: బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామగ్రామాన తిరిగి సర్పంచులుగా గెలిపిస్తానని అన్నారు. ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధిని ప్రజలందరికీ వివరిస్తూ ఓట్లు అడుగుతానని పేర్కొన్నారు. బీర్కూర్ చౌరస్తాలోని ఎస్ఎంబీ ఫంక్షన్హాలుగా బుధవారం నిర్వహించిన బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజాంసాగర్ నీటి ని విడుతల వారీగా విడుదల చేస్తున్నారని, ఎకరం భూమి ఎండిపోకుండా చూస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలన్నారు. బాన్సువాడ ని యోజకవర్గంలో జరిగిన అభివృద్ధి రాష్ట్రం లో మరెక్కడా జరగలేదని తెలిపారు. బాన్సువాడ అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఎర్రపహాడ్ గ్రామంలో ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించలేదని, ఆయన ఇంటి ఎదుట ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం పడిపోతున్నా నిర్మించలేదని ఆరోపించారు. అక్కడి ప్రజలు తరిమిస్తే సిగ్గు లేకుండా బాన్సువాడకు వచ్చి పచ్చి అబద్ధాలు ఆడుతూ పబ్బం గడుపుకుంటున్నాడని విమర్శించారు. బీర్కూర్ పట్టణ శివారులో కాలువ సరిగా లేక సాగునీరు అందడంలేదని ఆలోచించి నూతన కాలువ నిర్మాణం కోసం సుమారు రూ. కోటీ 15 లక్షల మంజూరుచేయించినట్లు గుర్తుచేశారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.150 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలను నిర్మించి, రైతులకు న్యాయం చేసినట్లు తెలిపారు. కానీ ఏనుగు రవీందర్రెడ్డి సిగ్గులేకుండా తనపై బురుదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చినట్లు చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రొటోకాల్ పాటించాల్సిందే అని, ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. మర్యాద ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలన్నారు.బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు తాను ఎవరిపై వ్యక్తిగతంగా కక్ష సాధించలేదని తెలిపారు. తాను కక్ష సాధిస్తే ఎవరూ మిగిలేవారు కాదని, తాను అలాంటి వాడిని కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.అనంతరం నియోజక వర్గంలోని సర్పంచుల పదవీకాలం పూర్తయిన సందర్భంగా వారిని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచారం, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, జిల్లా బంజార సేవాసంఘం అధ్యక్షుడు బద్యానాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్నాయక్, మహ్మద్ ఎజాస్, ఎంపీపీ దొడ్ల నీరజా వెంకట్రామ్ రెడ్డి, ఎంపీపీ రఘు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేదిలేదని హెచ్చరించారు. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తకు తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.