బోధన్, సెప్టెంబర్ 19: ఒకపక్క రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాల కింద కాంగ్రెస్, బీజేపీలోని బడా నాయకులు మొదలు చోటా నాయకుల వరకు ప్రతి ఏటా లక్షలాది రూపాయల లబ్ధిపొందుతూ.. మరోపక్క తమకు మేలు చేస్తున్న సీఎం కేసీఆర్ను.. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శిస్తున్నారంటూ బోధన్ శాసనసభ్యుడు మహ్మద్ షకీల్ ఆ పార్టీల నాయకుల తీరును ఎద్దేవా చేశారు. బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బోధన్ నియోజకవర్గంలో పెంచిన పింఛన్ మొత్తంతో లబ్ధి పొందిన దివ్యాంగులు, కొత్తగా పింఛన్లకు ఎంపికైన బీడీ టేకేదారులకు ఆయన మంజూరుపత్రాలను మంగళవారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ రైతుబంధు, ఆసరా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ పార్టీలు, కులాలు, మతాలకతీతంగా అమలుచేస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అనుభవిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సీఎం కేసీఆర్ నచ్చకపోతే..
తాము ఇప్పటివరకు రైతుబంధు, సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన డబ్బును వెంటనే గ్రామ కమిటీలకు వాపస్ చేయాలని ఎమ్మెల్యే షకీల్ సవాల్ చేశారు. ఇకమీదట సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపైనా విమర్శలు మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. దివ్యాంగులకు ఇప్పటివరకు రూ.3,016 పింఛన్ వస్తుండగా, ఆ పింఛన్ మొత్తాన్ని రూ.4,016కు పెంచామన్నారు. ఇంత పెద్ద మొత్తం దేశంలో ఏ రాష్ట్రం కూడా దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడంలేదన్నారు. అలాగే, ఈ నెల నుంచి కొత్తగా బీడీ టేకేదారులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 80 శాతం కుటుంబాలకు నెలకు రూ.10 కోట్లను పింఛన్లుగా ఇస్తున్నామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు.
ప్రస్తుతం బోధన్ నియోజకవర్గంలోని 3,860 మంది దివ్యాంగులకు పెంచిన పింఛన్లు అందుతున్నాయన్నారు. దివ్యాంగులకు పింఛన్లతో పాటు నియోజకవర్గంలోని ప్రతి దివ్యాంగ కుటుంబానికి తాను ఒక కానుకను ఇండ్లకు పంపుతానని తెలిపారు. తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో సంక్షేమ పథకాలను అమలుచేయని కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ అధికారంలోకి వస్తే ఇస్తామంటే ప్రజలు నమ్మబోరన్నారు. సభలో జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బోధన్ ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్, బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్, సాలూర, బోధన్, నవీపేట్ బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు గోగినేని నర్సయ్య, సంజీవ్కుమార్, నర్సింగ్రావు, పార్టీ నాయకులు బుద్దె రాజేశ్వర్, సంగం వెంకట్రెడ్డి, భవానీపేట్ శ్రీనివాస్, తెడ్డు పోశెట్టి, గుమ్ముల అశోక్రెడ్డి, నాగన్పల్లి మధు, బెంజర్ గంగారాం, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, మైనార్టీల సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషిచేసిందని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ‘మైనార్టీబంధు’ కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీచేశారు. అర్హులైన మైనార్టీలకు విడుతలవారీగా ఈ సహాయం అందుతుందని ఆయన అన్నా రు. మొదటి విడుతగా ప్రస్తుతం 186 మందికి చెక్కులను ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్, బోధన్ బల్దియా వైస్ చైర్మన్ ఎత్తేశామ్ సోహెల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్యాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, వివిధ మండలాల ముస్లిం మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.