కమ్మర్పల్లి, డిసెంబర్ 3: కేసీఆర్ రైతులు, పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలు కొనసాగేలా ప్రజల పక్షాన నిలబడతానని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమలు కోసం ప్రజలతో ఉండి పోరాడుతానని స్పష్టం చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన అనంతరం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తనతోపాటు తన కుటుంబంపై విపక్షాలు విష ప్రచారం చేసినా నమ్మకుండా తనను మూడోసారి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు మళ్లీ ఐదేండ్లు సేవకుడిగా పని చేస్తానని అన్నారు.
తనకు హ్యాట్రిక్ విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు తనపై గంజాయి వ్యాపారం చేస్తానని, చాలా రకాలుగా అబద్ధపు, దుష్ప్రచారాలు, విమర్శలు చేసినా స్పందించ లేదన్నారు. ఈ అబద్ధపు ప్రచారాలతో ప్రజల్లో కొంత అపోహలు కల్పించి వారు తన మెజార్టీని తగ్గించ గలిగారేమో కానీ తన గెలుపును మాత్రం ఆపలేకపోయారన్నారు. అవతలివారు ఒక్కసారి అవకాశం ఇవ్వండని ఎంత అడిగినా ప్రజలు తన పైనే విశ్వాసం ఉంచారని..ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు.