తొమ్మిదేండ్లలో సంక్షేమ ఫలాలు అందని ఇల్లు లేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండలం పెద్ద తడ్గూర్లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. అందరూ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమనారు.
మద్నూర్, ఏప్రిల్ 18: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లులేదని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయని పేర్కొన్నారు. మద్నూర్ మండలంలోని పెద్దతడ్గూర్ గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన తొమ్మిదేండ్ల కాలంలోనే అభివృద్ధి జరిగిందని, అంతకుముందు ఎటువంటి అభివృద్ధి లేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
డబుల్ బెడ్ రూం ఇండ్లు లేవని బీజేపీ నాయకులు అం టున్నారని, తాము ప్రతి గ్రామంలో ఇండ్లు కట్టిస్తున్నామని, త్వరలో అర్హులందరికీ అందిస్తామన్నారు. కేంద్రం లో బీజేపీ అధికారంలో ఉన్నదని, పదివేల డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరుచేయించి మా ట్లాడాలని బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. ఇష్టారీతిగా మాట్లాడడం సరికాదన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదని తెలిపారు. కేసీఆర్ పార్టీ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ని అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడ ఏం అవసరమో తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చాక వాటిని అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే తపనతో పాలన సాగిస్తున్నారని అన్నారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో అద్దంలా రోడ్లు
జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా రోడ్లు అద్దంలా మెరుస్తున్నాయని ఎమ్మెల్యే షిండే తెలిపారు. రూ. 345 కోట్లతో రోడ్లను నిర్మించామని చెప్పారు. ఎంపీ బీబీపాటీల్ కృషితో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి రోడ్లు నిర్మించామని, నియోజకవర్గంలో మరో 11 గ్రామాలకు వేయాల్సి ఉందని త్వరలో మంజూరు వస్తుందన్నారు. రూ.476 కోట్లతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూమిపూజ చేసుకున్నామని త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. నాలుగు మండలాల పరిధిలోఉన్న 40వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని అన్నారు. మద్నూర్, బిచ్కుంద ప్రాంతాల రైతుల కోసం మరో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 200 కోట్లు అడిగామని తెలిపారు.
నిర్మాణం పూర్తయితే 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్యే షిండే భోజనం వడ్డించారు. గ్రామాల నాయకులతో విడివిడిగా మాట్లాడి సమస్యలను తెలుసుకొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ కొండా గంగాధర్, విండో చైర్మన్ శ్రీను పటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు దరాస్ సురేశ్, గఫర్, బీఆర్ఎస్ డోంగ్లి మండల అధ్యక్షుడు శశాంక్పటేల్, మాజీ జడ్పీటీసీ బస్వారాజ్ పటేల్, సలాబత్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ కాశీనాథ్పటేల్, నాయకులు మొయిన్పటేల్, విజయ్కుమార్, కుశాల్, నర్సింహులు గౌడ్, నాగేశ్, హన్మాండ్లు, అర్జున్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.