ఖలీల్వాడీ, సెప్టెంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ చేరుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని 15, 20, 21 డివిజన్లలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 15వ డివిజన్ నిజాంకాలనీ, 20 డివిజన్ బ్యాంకు కాలనీ, 21 డివిజన్ పీఅండ్టీ కాలనీలో రూ. కోటి చొప్పున నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 20వ డివిజన్లో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ.. నగరంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తూ , ప్రతి డివిజన్కు కోటి రూపాయల (టీయూఎఫ్ఐడీసీ)నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి డివిజన్లో అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు.
నలుదిక్కుల విశాలమైన రోడ్లు, ఆకర్షణీయమైన సెంటర్ మీడియన్లు నిర్మించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేందుకు ఆలయాలను పునర్నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజల సౌకర్యార్థం సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నామని, పెరుగుతున్న జనాభాకనుగుణంగా ప్రజలకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ మేయర్ ఆకుల సుజాత, బీఆర్ఎస్ నాయకులు సిర్ప రాజు, ఎనుగందుల మురళి, సుజిత్సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, కార్పొరేటర్లు ముచ్కూర్ లావణ్యా నవీన్, సిరిగాద ధర్మపురి, పంచరెడ్డి నర్సుబాయి, న్యాలం రాజు, కో-ఆప్షన్ మెంబర్ అంతరెడ్డి లతా దేవేందర్రెడ్డి, నాయకులు చింతకాయల రాజు, కస్తూరి గంగరాజు, పాలకొండ నర్సింగ్రావు, తుమ్మ నాగభూషణం, శివప్రసాద్, సాప మోహన్, కృష్ణారెడ్డి, సుజన్, యెండల ప్రసాద్, యెండల ప్రదీప్, గోపరి లక్ష్మణ్, గంగామణి తదితరులు పాల్గొన్నారు.