ఖలీల్వాడి, అక్టోబర్ 19: గొల్ల కుర్మలు ఆర్థికంగా వృద్ధి చెందాలనే ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని వినాయక్నగర్లో ఉన్న మున్నూరుకాపు సంఘంలో గురువారం యాదవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిగాల హాజరై మాట్లాడారు. యాదవుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా రూ.25 లక్షలతో యాదవ భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అన్ని కులాలు, మతాల వారు సంతోషంగా ఉన్నారని అన్నారు. నగరంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు.
చివరి మజిలీ గౌరవంగా జరిగేందుకు ఆధునిక సదుపాయాలతో వైకుంఠధామాలు నిర్మించినట్లు తెలిపారు. సంక్షేమంలో భాగంగా ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చాక విడుతల వారీగా ఆసరా పింఛన్లు రూ.5వేలకు పెంచుతామన్నారు. సంక్షేమం, అభివృద్ధి చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూకిరణ్, కార్పొరేటర్లు మల్లేశ్యాదవ్, ఆకుల హేమలత, మహిళా నాయకులు మేక లక్ష్మీ యాదవ్, మంజులా యాదవ్, నాని యాదవ్, యాదవ సంఘం నాయకులు గుర్రం మల్లేశ్ యాదవ్, కుంబాల యాదగిరి యాదవ్, రఘు యాదవ్, దేవేందర్ యాదవ్ పాల్గొన్నారు.