అరవై ఏండ్ల సమైక్యపాలనలో చెరువుల వ్యవస్థ విధ్వంసమయ్యింది. ఉమ్మడి రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యంతో చెరువులు పురాతన జ్ఞాపకంగా మారాయి. తటాకాలు ఆనవాళ్లు కోల్పోయాయి. చిన్నపాటి వర్షాలకే బుంగలు పడేవి. భారీ వానలకు కట్టలు తెగిపోయేవి. చెరువు నీరు కట్టకింద పొలాలకు ఒక్క పంటకు అందడమే గగనమయ్యేది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత చెరువుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సంకల్పించారు. విధ్వంసమైన చెరువుల వ్యవస్థను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయ పేరుతో మహాయజ్ఞమే చేపట్టారు. ఈ పథకం చేకూర్చిన అద్భుత ఫలితాలు కండ్లముందే సాక్షాత్కరిస్తున్నాయి. నాడు వట్టిపోయిన చెరువులు.. నేడు జలకళను సంతరించుకున్నాయి. ప్రతి చినుకూ చేరి చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. ఏడాదిపాటూ తటాకాల్లో జలసవ్వడులు వినిపిస్తున్నాయి. ఆయకట్టు భూములన్నీ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నాలుగు విడుతల్లో 1,941 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో దండిగా పంటలు పండుతున్నాయి.
– నిజామాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యం కారణంగా చిన్న, మధ్యతరహా నీటి వనరుల వ్యవస్థ విధ్వంసమయ్యింది. పాలకుల పట్టింపులేని తనానికి నేలకు చేరిన వర్షపు చినుకులు వృథాగా వాగులు, వంకలు దాటుకొని సముద్రం పాలయ్యేవి. సామర్థ్యం ఉన్నప్పటికీ ఆయా చెరువుల్లోకి వరద చేరే పరిస్థితి లేకపోయేది. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ నీటిని ఒడిసి పట్టుకొని యాసంగిలో పంటల సాగుకు వాడుకునే అవకాశం లేదు. దీంతో సాగు నీరు లేక రైతులు భూములను పడావుగా వదిలేది. బోరుబావుల్లో ఉన్న నీటి వనరుతోనే పెద్ద సాగుదారులు మాత్రమే పంటలు వేసేది. చిన్న, సన్నకారు రైతులైతే యాసంగికి చేతులెత్తేసి ఏటా వానాకాలంపైనే ఆధారపడి జీవించేది. కానిప్పుడు ఏడాదికి రెండేసి పంటలకు తగ్గకుండా రైతులు తమ భూములను సాగు చేస్తున్నారు. వానకాలం, యాసంగి అన్న తేడా లేకుండా పుష్కలంగా నీటి వనరులతోపాటు సాగుకు ప్రోత్సాహకాలు అందుతుండడంతో వ్యవసాయం పరుగులు తీస్తున్నది. ఇందుకు ప్రధానంగా సాధించుకున్న తెలంగాణకు పరిపాలన రథసారథిగా ఉన్న కేసీఆర్ ముందుచూపు, దార్శనికతే ముఖ్య కారణం. రాష్ట్రం సిద్ధించిన తొలినాళ్లలోనే వట్టిపోయిన చెరువులను బాగు చేయించడం ద్వారా పుష్కలంగా నీటి వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.
చెరువుల్లోకి పరుగులు తీస్తున్న వరద…
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు మిషన్ కాకతీయ పథకం అంటే చెరువులను బాగు చేసుకోవడం ఒక్కటే కాదు. వర్షపు నీటిని 10 నెలల పాటు నిల్వ చేసుకొని ఆయకట్టుకు కొరత లేకుండా సాగు నీరు అందించడమే ప్రధాన ధ్యేయం. తటాకాల్లో పూడికతీత పనులు చేపట్టడంతో చెరువుల సామర్థ్యం పెరిగింది. దశాబ్దాలుగా కూరుకుపోయిన పూడికను తీయడంతో చెరువులకు పునర్వైభవం వచ్చింది. దీంతో వర్షపు నీరు ఎక్కువగా నిల్వ చేసుకునే సౌలభ్యం ఏర్పడింది. స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు వరకు భారీ వానలు పడితే ఎక్కడో ఒక చోట చెరువులకు బుంగ పడడం, గండి పడి కొట్టుకపోవడం వంటివి కనిపించేవి. ఇప్పుడు చెరువు కట్టలు బలోపేతం చేయడంతో చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయి. మొన్నటి అతి భారీ వానలతో అపారమైన నష్టం వాటిల్లాల్సిన దుస్థితి ఉన్నప్పటికీ మిషన్ కాకతీయ పథకంలో చెరువులన్నీ పునరుద్ధరణకు నోచుకోవడంతో కేవలం ఒకట్రెండు మాత్రమే దెబ్బతిన్న పరిస్థితులే వెలుగు చూశాయి. చెరువు చుట్టూత భూగర్భ జలాలు సైతం గణనీయంగా వృద్ధిలోకి రావడమూ అదనంగా చేకూరుతున్న మరో ప్రయోజనం. నేలపై కురిసిన వర్షపు చినుకులు వాగులు, వంకలు గుండా పయనించి ఆయా చెరువుల్లోకి వరద పరుగులు తీస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 1086 చెరువులకు 100శాతం చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇందులో దాదాపుగా 910 చెరువులు ఇప్పటికే అలుగులు పోయడం విశేషం. కామారెడ్డి జిల్లాలో 1425 చెరువులకు 1100 చెరువులు మత్తడి దుంకాయి. మిగిలిన వాటిల్లో గరిష్ఠ స్థాయికి నీటి నిల్వ చేరుకున్నది.
మిషన్ కాకతీయ మహత్యం..
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఏటా రెండు పంటలతో వ్యవసాయ భూములు కళకళలాడుతున్నాయి. పడావు అన్న పదమే ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. సాగుకు ఉచిత విద్యుత్తోపాటు సాగు నీటి ఇక్కట్లు లేకపోవడంతో పండుగలా వ్యవసాయం మారింది. ఒక సీజన్ ముగుస్తుందంటే మరో సీజన్కు రైతులంతా పంటల సాగుకు ఆలోచన చేసే స్థాయికి చేరుకున్నారు. నీటి సౌకర్యం ఎలా? అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా కేసీఆర్ ఉన్నాడన్న ధైర్యం తో ముందుకు కదులుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన మిషన్ కాకతీయ పథకంతో అనేక చెరువులకు కొంగొత్త కళ వచ్చింది. పునరుద్ధరణ, శాశ్వత మరమ్మతు పనులతో ఇప్పుడు ఎక్కడ చూసినా తటాకాల్లో జలకళ సంతరించుకుంటుందంటే ఇందుకు పూడికతీత పనులే కారణం. 2014కు మునుపు చెరువుల కింద బోసిపోయిన ఆయకట్టు.. ఇప్పుడు పచ్చని కోకను తలపిస్తున్నది. కాలువల ఆధునికీకరణ, తూముల రిపేర్లు, చెరువుల్లో పూడికతీత వంటి చర్యలతో వానకాలంలో నిల్వ అయిన జలాలు ఏడాది పొడవునా అవసరాన్ని తీరుస్తున్నాయి. చెరువుల కింద ఆయకట్టు 60 నుంచి 90శాతానికి ఎగబాకినట్లు జలవనరుల శాఖ చెబుతున్నది. నిజామాబాద్ జిల్లాలో 1086 చెరువుల పరిధిలో ఒకప్పుడు 40వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు అందేది. ఇప్పుడు సాగు విస్తీర్ణం రెట్టింపు అయ్యింది. లక్షా 11వేల ఎకరాల్లో పంటలు సాగవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 1425 చెరువుల పరిధిలో ఏకంగా 97,881 ఎకరాల ఆయకట్టుకు ప్రాణం పోసినట్లు అయ్యింది.
ఎప్పుడు సూశినా నీళ్లుంటున్నయి..
ఎల్లారెడ్డి రూరల్: కేసీఆర్ ముందుసూపు పుణ్యమా అని చెర్లల్ల ఎప్పుడు సూశినా నీళ్లుంటున్నయి. ఇంతకుముందు వానలు పడితేనే చెర్లల్ల నీళ్లు కనబడుతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఒక్క సుక్కకూడా నీళ్లు కనబడకపోతుండె. మిషన్ కాకతీయ పథకం చేయవట్టి చెరువులన్నీ మస్తు లోతు అయినయి. కట్టలు గట్టిగైనయి. అందుకే మూడు కాలాలూ చెర్లల్ల నీళ్లు ఉంటున్నయి. ఎవుసం చేసుకునే రైతుకు నీళ్లకు ఫికర్ లేకుంటా పోయింది.
– వెల్లుట్ల రాజయ్య, రైతు, కొత్తపల్లి
పంటలకు ఢోకా లేదు..
ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 7: గిప్పటి దాక మస్తుమంది లీడర్లను సూశినం కని కేసీఆర్ అసొంటి లీడర్ను సూడలే. చెర్ల గురించి ఇప్పటిదాక ఎవ్వరన్న పట్టించుకున్నరా? కేసీఆర్ సారు మాత్రం మస్తు ఆలోచించి రైతుకు పనికచ్చేటట్లుగా చెర్లను మంచిగ జేసిండు. మిషన్ కాకతీయ పథకం తోటి మా ఊరి చెర్ల ఎప్పటికీ నీళ్లుంటున్నయి. రెండు పంటలకు ఢోకా లేదు.
– రతన్ నాయక్, రైతు, భిక్నూర్ తండా
పొలాలు మంచిగైనయ్
ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లు మిషన్ కాకతీయతోటి రెండు లాభాలైనయ్. చెర్లు లోతుగైనయ్. చెర్లకెళ్లి తీసిన పూడికమట్టి పొలాలల్ల ఏసుకుంటే, పొలాలు గూడా మంచిగైనయ్. అప్పట్ల వర్షాలు పడినప్పడు చెరువులు నిండుతుండె. కానీ తూములు, అలుగులు మంచిగలేక నీళ్లన్నీ ఉట్టిగనే పోతుండె. ఇప్పడు చెర్లకెళ్లి ఒక్క నీళ్ల సుక్క ఎటూపోతలేదు. ఒక్క చెరువు మంచిగుంటే రైతు ఒక్కడే కాదు, సాకలోళ్లు, కుమ్మరోళ్లు, బేస్తోళ్లు ఇట్ల అందరు మంచిగైతరు. గిదంతా సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది.
– ధారావత్ సుభాష్, రైతు, తిమ్మాపూర్ తండా