ఖలీల్వాడి, మే 28 : తొమ్మిదేండ్లలో రాష్ట్ర ప్ర భుత్వం సాధించిన ప్రగతిని వివరించేలా దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరగాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా అధికారులతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఆదివారం జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారని తెలిపారు. సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. దేశానికి ధాన్యాగారంగా చెప్పుకునే పంజాబ్ను కూడా వరిసాగులో తెలంగాణ అధిగమించిందన్నారు. ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ర్టానికి క్యూ కడుతున్నాయంటే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధే కారణమన్నారు. ప్రతి మండలానికి నోడల్ అధికారిని నియమించాలని, వార్డులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. జూన్ 2 నుంచి 22 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని, రోజుకో కార్యక్రమం ఉంటుందని మంత్రి వేముల వివరించారు.