న్యూఢిల్లీ, ఆగస్టు 2 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి మరో రికార్డు సృష్టించింది. జూలై నెలలో రికార్డు స్థాయిలో 2,48,845 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. క్రితంఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసినదాంతో పోలిస్తే 33 శాతం అధికం. జూలై 2025లో సంస్థ 1,87,073 యూనిట్ల వాహనాలను ప్రొడ్యూస్ చేసింది. ఈ సందర్భంగా మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ మాట్లాడుతూ..గత నెలలో 1.78 లక్షల యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయని, డీలర్లకు పంపిన స్టాక్స్ కేవలం 16 రోజుల్లోనే అమ్ముడవుతున్నాయన్నారు.
అయినప్పటికీ ప్రస్తుతం 1.6 లక్షల యూనిట్ల బుకింగ్లు ఉన్నాయని, వీటిని త్వరలో సరఫరా చేయనున్నట్టు చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సరాసరి ఇన్వెంటరీ 30 రోజులు ఉండగా, అదే సంస్థ ఇన్వెంటరీ కేవలం 16 రోజులేనని పేర్కొన్నారు. ప్యాసింజర్ వాహన విక్రయాల్లో దూసుకుపోతున్న సంస్థ..గత నెలలో 1,96,203 యూనిట్ల పీవీలను దేశీయంగా విక్రయించింది. అంతక్రితం ఏడాది ఇది 1,37,776 యూనిట్లుగా ఉన్నాయి. అలాగే లైట్ కమర్షియల్ వాహనాలను 2 లక్షల యూనిట్లను విక్రయించగా, లక్ష యూనిట్ల యుటిలిటీ వాహనాలు ఉన్నాయి.