ఎల్లారెడ్డి, ఏప్రిల్ 2 : దేశంలోనే ప్రజల కోసం పనిచేసే ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని, సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధర్మంగా పాలన సాగుతున్నదని, ఇదే ధర్మపాలనను దేశవ్యాప్తంగా అందించేందుకు సీఎం కేసీఆర్ బయల్దేరారని వివరించారు. సీఎం కేసీఆర్ ఏదైనా పని మొదలు పెట్టాడంటే విజయవంతంగా తిరిగొస్తాడని, టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిమాణాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్రమోదీని దించుడు ఖాయమని, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. గాంధారిలో ఆదివారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, దేశంలో 154 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క కాలేజీ ఇవ్వలేదని వివరించారు. గుజరాత్కు రూ.20వేల కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేశారన్నారు. దేశంలో ఉత్తమమైన 20 గ్రామాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే అందులో 19 గ్రామాలు తెలంగాణకు చెందినవే ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలోని షెట్కార్ సంఘటన్ నాయకులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు నచ్చి పార్టీలో చేరుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో పాగా వేయడం ఖాయమని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎల్లారెడ్డిలో గులాబీ జెండా ఎగిరిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతున్నదని అన్నారు. కార్యకర్తలే నాయకులు అవుతారని, కార్యకర్తలు లేకుంటే నాయకులు ఉండరని, పార్టీ ఉండదని అన్నారు. పార్టీలో సమస్యలు, ఇబ్బందులు ఉంటే సర్దుబాటు చేసుకునేందుకే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని వివరించారు. కొత్త, పాత అనే తేడా లేకుండా పనిచేసుకుందామని, బాల్కొండకు ఎన్ని నిధులు వచ్చాయో అదేస్థాయిలో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చాయని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్వన్గా ఉన్నదని వివరించారు.
గాంధారి, ఏప్రిల్ 2: గులాబీ జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. 2001 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గులాబీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు ధన్యావాదాలు తెలిపారు. కార్యకర్తల త్యాగాల ఫలితంగానే, ప్రస్తుతం అభివృద్ధి ఫలాలు అందతున్నాయని, కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ మర్చిపోదని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని, 24గంటలు అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని అన్నారు. బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలు కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, జడ్పీ చైర్పర్సన్ శోభారాజు, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ భాస్కర్రెడ్డి, జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధాబలరాం, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణరావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శివాజీరావు, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్, వైస్ ఎంపీపీ భజన్లాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ రెడ్డిరాజు, ఎంపీటీసీ పత్తి శ్రీనివాస్, విండో డైరెక్టర్ తాడ్వాయి సంతోష్, సత్యం, బెజుగం సంతోష్, ముకుంద్రావు, శ్రీనివాస్, శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవని, ఎనిమిదేండ్లలోనే కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరిగిందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు పార్టీ కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలసిమెలసి ఉండాలని సూచించారు. మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి వెన్నుముకలాంటి వాళ్లని అన్నారు.