బాల్కొండ (ముప్కాల్ ) జూన్ 3: రైతుల సంక్షేమం కోసం బాగా ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేసీఆర్ ఒక పార్టీ నాయకుడే కాదని, యావత్ తెలంగాణ సమాజానికి జాతిపిత అని అభివర్ణించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం బాల్కొండ మండలం వన్నెల్(బీ) రైతువేదికలో నిర్వహించిన రైతు దినోత్సవంలో మంత్రి వేముల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో చెరువుల్లో నీళ్లు లేక, కరెంటు కష్టాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టారని, తరచూ బోరు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి సమస్యలతో ఎల్లవేళలా రైతులు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వచ్చేదని గుర్తు చేశారు. స్వరాష్ట్ర సాధనతోనే ప్రజల బాధలు దూరమవుతాయని భావించి, ఉద్యమనేత కేసీఆర్ తన పదవులను త్యజించి 2001లో తెలంగాణ జెండా ఎత్తుకున్నారని వివరించారు. సబ్బండవర్గాల సహకారంతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని రంగాలు గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించారు.
రైతుని రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతాంగ ప్రయోజనాల కోసం సాగునీటి పథకాలు, చెక్డ్యాములు, వరద కాలువలు నిర్మించామని, మరే ఇతర రాష్ర్టాల్లో ఇలాంటివి లేవన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ను అందిస్తూ, రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గంలోనే 2014తో పోలిస్తే 40వేల ఎకరాల్లో పంట సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. రైతుబంధు ద్వారా రూ.611కోట్లు పెట్టుబడిరూపంలో అందించామని, ఉచిత విద్యుత్ కోసం రూ.1100కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.430కోట్ల విలువజేసే ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించినట్లు తెలిపారు. 52వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 2014లో 4లక్షల14వేల ఎకరాల్లో పంటలు సాగయ్యేవని, ప్రస్తుతం 5లక్షల 40వేల ఎకరాల్లో పంటలు పండిస్తున్నారని మంత్రి వేముల తెలిపారు.
జిల్లాలో వరి సాగు లక్షా93వేల ఎకరాల నుంచి ఏకంగా 4 లక్షల 18వేల ఎకరాలకు పెరిగిందన్నారు. ఉచిత విద్యుత్కు రూ. 3719 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. గతంలో జిల్లాలో కేవలం 26 మంది వ్యవసాయ విస్తీర్ణ అధికారులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 106 పెరిగిందని గుర్తుచేశారు. రైతుబంధు కింద జిల్లా వ్యాప్తంగా రూ. 2003 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించామని అన్నారు. వన్నెల్(బీ) క్లస్టర్ పరిధిలోని ఐదు గ్రామాల రైతులకు రైతుబంధు ద్వారా రూ.23కోట్లు, రైతుబీమా రూ.కోటీ65లక్షలు, ఉచిత విద్యుత్కు రూ.9.15కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలు వాస్తవ పరిస్థితులను గమనించాలని, అన్ని రకాలుగా మేలు చేకూరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలవాలని కోరారు. ఏ మాత్రం ఆదమరిచినా మళ్లీ 2014నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటుందని అన్నారు. అనంతరం వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను వెల్లడిస్తూ రూపొందించిన కరపత్రాలను మంత్రి వేముల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్, నోడల్ అధికారి సింహాచలం, రైతు ప్రతినిధులు కోటపాటి నర్సింహనాయుడు, డాక్టర్ మధుశేఖర్, రైతుబంధు సమితి ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకులకు మంత్రి సవాల్..
బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ర్టాల్లోని రైతులకు ఉచితంగా కరెంటు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని మంత్రి వేముల సవాల్ విసిరారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాదిరి ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. వీటన్నింటికీ సమాధానం చెప్పి రైతుల గురించి మాట్లాడాలని హితవుపలికారు.
రైతుబీమా మాకు భరోసానిచ్చింది..
మాకు మూడు ఎకరాల భూమి ఉన్నది. దానిపైనే మా కుటుంబం ఆధారపడి బతుకుతున్నాం. మా నాన్న చనిపోవడంతో ఒక్కసారిగా దిక్కుతోచనిస్థితికి చేరాం. మా కుటుంబం రోడ్డున పడినైట్లెంది. అంతలోనే రైతుబీమా మా కుటుంబానికి ఎంతగానో తోడ్పాటును ఇచ్చింది. రూ.5లక్షలు ఇవ్వడంతో రూ.2లక్షల అప్పు తీర్చాం. మిగిలిన రూ.3లక్షలు మా అమ్మ బావాయి పేరిట బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. దీంతో అమ్మకు, మా కుటుంబానికి భరోసా కలిగింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లకాలం రుణపడి ఉంటాం.
– కొండూరు రాజేశ్, వన్నెల్(బీ)