భీమ్గల్, అక్టోబర్ 18: భీమ్గల్ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ. సమస్యలతో సావాసం చేస్తున్న జీపీ. రోజురోజుకూ పెరుగుతున్న పట్టణ విస్తరణతో మౌలిక వసతుల కల్పన లేమి కొట్టొచ్చినట్లు ఉండేది. దీంతో స్థానిక ఎమ్మెల్యే అయిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి.. భీమ్గల్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. జనాభా ఎక్కువగా ఉన్న భీమ్గల్ను మున్సిపాలిటీగా మారిస్తే నిధుల కొరత ఉండదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో పురపాలికగా ఏర్పాటు చేయించారు. దీంతో అప్పటి నుంచి భీమ్గల్ దశ మారింది. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మౌలిక వసతుల కల్పనకు రూ.35కోట్ల నిధులను మంజూరు చేయించారు.
వాటితో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు తదితర పనులను ప్రారంభించారు. ఆ పనులు 90శాతం పూర్తయ్యాయి.
అధ్వానమైన రోడ్లు.. రాత్రయితే చాలు దారులన్నీ చీకట్లే.. తాగునీటి కోసం ఇక్కట్లు.. సరైన వైద్య వసతులు లేక రోగుల బాధలు..దుర్గంధం వెదజల్లే రోడ్లు, మురికి కాలువలు.. ఇదీ మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పటి భీమ్గల్ దుస్థితి. సమైక్య పాలనలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ.. భీమ్గల్వాసుల కష్టాలు తీరలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం భీమ్గల్ ప్రజల సమస్యలు పరిష్కారమవుతూ వచ్చాయి. తొమ్మిదేండ్లలో అద్దంలా మెరిసే రోడ్లు వేశారు. తాగునీటి కష్టాలు తీరాయి. కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, వీధులన్నీ ఎల్ఈడీ లైట్లతో జిగేల్మనేలా తయారయ్యాయి. స్వరాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో భీమ్గల్వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మనిషి చివరి మజిలీకి గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రూ. కోటీ90 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో అన్ని మతాల వారికి సకల సౌకర్యాలతో ఆరు వైకుంఠధామాలను నిర్మించారు. ఆధునిక హంగులతో నిర్మించిన వైకుంఠధామాలు పార్కులను తలపిస్తున్నాయి. ఇదివరకు కొన్నింటిని ప్రారంభించుకోగా, మిగిలిన వాటి పనులు తుది దశకు చేరుకున్నాయి. పట్టణంలో సేకరించిన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.50లక్షల నిధులతో ఎఫ్ఎస్టీపీ ఏర్పాటు చేశారు. వివిధ పనుల మీద పట్టణానికి వచ్చే వారి కోసం రూ.30లక్షల నిధులతో నాలుగు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించారు.
భీమ్గల్ పట్టణంలో రహదారుల నిర్మాణం, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట రూ.18కోట్లను మంజూరు చేసింది. దీంతో పనులు పూర్తికాగా, మంత్రి వేముల చొరవతో మరో రూ.8కోట్లను కేటాయించి అదనంగా 1.5కిలోమీటర్ల మేర పనులను చేపట్టారు. దీంతో రాత్రిసమయంలో పట్టణంలోని రహదారులన్నీ వెలుగులు విరజిమ్ముతున్నాయి. పట్టణంలోని 12 వార్డుల్లో 2100ఎల్ఈడీ బల్బులను బిగించారు.
పట్టణంలోని రాథం చెరువుపై రూ.5.90కోట్లతో మినీ ట్యాంక్బండ్ నిర్మాణాన్ని చేపట్టారు. గతంలో బోసిపోయిన చెరువు కట్ట.. నేడు అందమైన రోడ్లు, సేద తీరేందుకు బెంచీలు, లైటింగ్తో సుందరంగా తయారైంది. ఇటీవల మినీ ట్యాంక్బండ్ను మంత్రి వేముల ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలతో భీమ్గల్ మొత్తం హరితవనంగా మారింది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎనిమిది ట్రీ పార్కులను ఏర్పాటు చేశారు. పన్నెండు వార్డుల్లో వందల సంఖ్యలో మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. సెంట్రల నర్సరీ ఏర్పాటుతో పట్టణంలో కావాల్సిన మొక్కలను పెంచి అవసరమైన వారికి అందజేస్తున్నారు.
పట్టణం పరిశుభ్రంగా ఉండేందుకు పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిధులు కేటాయించింది. చెత్త సేకరణకు గతంలో ఒక ట్రాక్టర్ మాత్రమే ఉండగా, పట్టణ ప్రగతిలో భాగంగా ఆటోలు, ట్రాక్టర్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. దీంతో చెత్త సేకరణ సులభమైంది. ప్రజల సౌకర్యార్థం రూ.6కోట్లతో వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం చేపడుతున్నది. పనులు చివరి దశకు చేరుకోగా, మార్కెట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు కావాల్సిన కూరగాయలు, నాన్వెజ్ ఒకే చోట లభించనున్నది.
పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత భీమ్గల్ చాలా మారింది. మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులు మంజూ రు చేయించడంతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే సెంట్రల్ లైటింగ్, నాలుగు వరుసల రోడ్డు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్ల పనులు పూర్తయ్యాయి. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి పురపాలికగా మారిన నాలుగేండ్లలోనే జరిగింది. సీఎం కేసీఆర్, మంత్రి వేముల సహకారం మరువలేనిది.
భీమ్గల్ పట్టణంలో ప్రధాన సమస్య తాగునీటి సరఫరా. సమైక్య పాలనలో ఏ కాలమైనా.. తాగునీటి కొరతే. అలాంటి సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథతో చెక్ పెట్టింది. ఇంటింటికీ తాగునీరు అందించాలన్న సంకల్పంతో రూ.5.50కోట్లతో కుళాయిలను ఏర్పాటు చేసింది.
పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్లో అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు. రూ.కోటి నిధులతో సుందరంగా తీర్చిదిద్దారు. పార్కులో వాకింగ్ట్రాక్ దానిచుట్టూ అందమైన మొక్కలు, యువతీయువకులు వ్యాయామం చేసేందుకు మినీజిమ్ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఉదయం, సాయంత్రం ప్రజలు ఎక్కువ సంఖ్యలో పార్కును సందర్శిస్తూ ఆహ్లాద వాతావరణంలో గడుపుతున్నారు.
రైతు బీమా ద్వారా ఒక్కో రైతుకు రూ.5లక్షల చొప్పున 24మందికి రూ.కోటీ 20లక్షలు అందజేశారు. 1478 మంది రైతులకు రైతుబంధు ద్వారా రూ.12కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. రూ.40లక్షలతో గొల్లకుర్మలకు 23యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. 401 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.91కోట్ల చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 677 మంది లబ్ధిదారులకు రూ.6.55 కోట్లు పంపిణీ చేశారు. 1365 మంది కి ఆసరా పింఛన్,1351 మందికి బీడీ పింఛన్లను ప్రతినెలా వారి అకౌంట్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దారు. రూ.96లక్షలతో బడులను బాగు చేశారు.
పట్టణ శివారులో ఉన్న కప్పలవాగుపై రూ.10.64కోట్లతో రెండు చెక్డ్యాములను నిర్మించారు. దీంతో రైతులకు నీటి కష్టాలు తీరాయి. భూగర్భ జలమట్టం పెరగడంతో రైతులకు రెండు పంటలకు సరిపడా నీళ్లు అందుతున్నాయి. వాగులో సుమారు సంవత్సరం పొడవునా నీళ్లుంటున్నాయి.
ప్రజలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలన్న సీఎం కేసీఆర్ ఆశయంతో భీమ్గల్కు వంద పడకల దవాఖానకు మంత్రి వేముల మంజూరు చేయించారు.రూ.35 కోట్లతో చేపట్టిన పనులను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రారంభించగా, పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. త్వరలోనే ప్రజలకు ఈ దవాఖాన అందుబాటులోకి రానున్నది. వంద పడకల దవాఖానలో డయాలసిస్ సెంటర్ను కూడా మంత్రి వేముల మంజూరు చేయించారు.
గూడు లేని పేదలకు ఉచితంగా ఇండ్లు అందించాలన్న ఉద్దేశంతో డబుల్ బెడ్రూం పథకం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా భీమ్గల్ పట్టణంలో రూ.14.15కోట్లతో 288 ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరింది. ఇండ్లను నిర్మించడమే కాకుండా మౌలిక వసతులైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్, వీధి దీపాలను ఏర్పాటు చేశారు.