భీమ్గల్, జూలై 4: పోడు భూములకు పట్టా పాస్ పుస్తకాల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బిక్కుబిక్కుమంటూ పంట పండించే దుస్థితి దూరమైందన్నారు. పట్టాల పంపిణీతో యజమానులుగా మా రిన గిరిజనులు, ఎలాంటి ఆటంకాలూ లేకుండా ధైర్యంగా పంటలు సాగు చేసుకోవచ్చని సూచించారు. భీమ్గల్ మండలంలోని తాళ్లపల్లిలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు పోడు భూ ముల పట్టాలను మంగళవారం పంపిణీ చేశారు. దేవక్కపేట్, దేవన్పల్లి, కారేపల్లి, కుప్కాల్, మెండోరా, రహత్నగర్, సికింద్రాపూర్, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన అర్హులైన 1011 గిరిజన కుటుంబాలకు పోడు భూముల పట్టా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపైతమైన నిర్ణయంతో అడవిబిడ్డలకు భరోసా ఏర్పడిందని, వారి భావితరాల జీవనోపాధికి కూడా భద్రత లభించిందన్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కలిగిన ఆనందం.. ప్రస్తుతం గిరిజనులకు పోడుపట్టాల పంపిణీ కార్యక్రమంతో అంతే సంతోషం కలిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షాయాభై వేల మందికి నాలుగు లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు అందిస్తున్నదని వివరించారు. జిల్లాలో 4300మందికి 8600 ఎకరాల భూములకు పట్టాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 1478 మందికి సుమారు రూ.400 కోట్ల విలువచేసే నాలుగువేల ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరుగుతున్నదన్నారు. దీనికి అదనంగా ఇటీవల మండలంలోని దేవక్కపేట్,కారేపల్లి గ్రామాల్లో 1700పైచిలుకు ఎకరాల అసైన్డ్ భూమిని సైతం లబ్ధిదారులకు పంపిణీ చేశామని ఈ సందర్భంగా మంత్రి వేముల గుర్తుచేశారు. పోడు భూములకు హక్కు లు కల్పించిన నేపథ్యంలో గిరిజనులు చెట్ల నరికివేతకు స్వస్తి పలకాలని మంత్రి హితవు పలికారు. అడవుల సంరక్షణే ధ్యేయంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెరిగితేనే ప్రకృతి అనుకూలించి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు.
గిరిజనులు ఎంతో ఇష్టంగా జరుపుకొనే తీజ్ వేడుకను దృష్టిలో పెట్టుకొని ప్రతి తండాలో తీజ్భవన్ ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్కు విన్నవిస్తానని హామీ ఇచ్చారు. తండాలకు గ్రామ పంచాయతీలుగా హోదా కల్పించడంతో గిరిజనులకు స్థానిక సంస్థల్లో స్వయం పాలన దక్కిందని గుర్తుచేశారు. మారుమూల ప్రాంతాల్లోని తండాలకు సైతం రోడ్లు, విద్యుత్, తాగునీటి వసతి వంటి సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్లు వెచ్చిస్తున్నదన్నారు. తాటిపల్లి-మరిమడ్ల రోడ్డు నిర్మాణానికి అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ వాటి ని అధిగమిస్తూ సీఎం కేసీఆర్ చొరవతో బీటీ రోడ్డు ను మంజూరు చేయించానని తెలిపారు. రహత్నగర్ నుంచి కారేపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
ఈ సీజన్ నుంచే రైతుబంధు అమలు..
జిల్లాలో అర్హులైన 4300 మందికి 8600 ఎకరాల పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్ తదితర వివరాలు సేకరించి ప్రస్తుత సీజన్ నుంచే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా మండల రైతాంగానికి రూ. కోటీ 38లక్షల రైతుబంధు పెట్టుబడి సాయం డబ్బులు జమ అయ్యాయని వివరించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించి దేవక్కపేట్, మానాల రైతులకు సంబంధించిన పోడు భూముల పట్టాలను కూడా మరో రెండు,మూడు రోజుల్లో పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ కేత్రస్థాయిలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన వారికి పోడుపట్టాలను పంపిణీ చేస్తామన్నారు. పట్టాలు అందుకున్న రైతులు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. నిజామాబాద్ ఆర్డీవో రవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావ్, ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ చౌట్పల్లి రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొయీజ్, రైతుబంధు సమి తి మండల అధ్యక్షుడు శర్మనాయక్, జిల్లా సభ్యుడు కన్నే సురేందర్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ముత్తెన్న, సమన్వయ సభ్యులు గంగాధర్, తుక్కాజీనాయక్, బంజారా సేవా సంఘం అధ్యక్షుడు చంద్రునాయక్ పాల్గొన్నారు.
-కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
ఇది మా అదృష్టం…
భూమి ఉన్నా వాటికి పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందక, పండించిన పంటను అమ్ముకోలేక చాలా ఇబ్బందులు పడ్డాం. అలాంటిది సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటప్రకారం మా భూములకు పట్టాలు అందించడం నిజంగా ఇది మా అదృష్టం. ఎంతోకాలంగా మేము ఎదురుచూస్తున్నాం. మేము ఉన్న దగ్గరకే వచ్చి పట్టాలను అందజేయడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటాం
– మలావత్ చంద్రకళ, గిరిజన మహిళారైతు, దేవక్కపేట్
సీఎం కేసీఆర్ను యాది మరువం
ఎంతో మంది వచ్చిండ్రు. కానీ ఎవ్వరూ ఏమీ చేయకుండా ఉట్టి మాటలు చెప్పి పోయిండ్రు. ఆఫీసుల చుట్టూ తిరిగినా కాని పని ఇప్పుడు మా దగ్గరకే వచ్చి మా పోడు భూముల పట్టాలను ఇత్తుండ్రు. నిజంగా నమ్మలేక పోతున్నాం. మా జీవితాంతం సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డిని యాది మరువం.
– మలావత్ కుర్మ, గిరిజన మహిళారైతు, కారేపల్లి.