వేల్పూర్, జూలై 21 : బాల్కొండ నియోజకవర్గంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు -భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని 8 మండలాల్లో నిర్మాణం పూర్తయిన, చివరి దశలో ఉన్న, పురోగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై ఆర్డీవో, తహసీల్దార్లతో వేల్పూర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. నిర్మాణం పూర్తయిన, పురోగతిలో ఉన్న ఇండ్ల వివరాలను మండలాల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, ఎలక్ట్రిసిటీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లతోపాటు నిర్మాణ చివరి దశలో ఉన్న ఇండ్లను ఈ నెలాఖరులోపు సిద్ధం చేసి ఆగస్టులో లబ్ధిదారులకు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని సూ చించారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుం డా లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలని మంత్రి స్పష్టం చేశారు. సమీక్షలో ఆర్డీవో వినోద్కుమార్, తహసీల్దార్లు, ఆర్అండ్బీ ఏఈ నర్సయ్య, మంత్రి ఓఎస్డీ విజేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కోటపాటి నర్సింహానాయుడు, బద్దం ప్రవీణ్రెడ్డి, రాజాగౌడ్ పాల్గొన్నారు.