బాల్కొండ, ఆగస్టు 30: రాజకీయాలు శాశ్వతం కాదని, మనం చేసే మంచి పనులే శాశ్వతమని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాల్కొండకు నూతనంగా మంజూరైన డిగ్రీ కళాశాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రితో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రజల చిరకాల వాంఛ అయిన డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం తనకెంతో సంతోషం కలిగిస్తున్నదన్నారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి సహకారంతో ఈ సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించుకున్నామన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం, ప్యాకేజీ 21, భీమ్గల్ 100 పడకల దవాఖాన, బాల్కొండ డిగ్రీ కళాశాల, కమ్మర్పల్లి, వేల్పూర్ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు టార్గెట్ పెట్టుకొని మరి సాధించానన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చిన తృప్తి మిగిలిందన్నారు. తానెప్పుడూ పేదవాళ్ల పక్షానే ఉంటానని మంత్రి స్పష్టం చేశారు. తన కుటుంబానికి 100 ఎకరాల భూమి 15 మంది పాలేర్లు ఉన్నా, తాను వేల్పూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని గుర్తు చేశారు. ఎస్సీ, బీసీ సంక్షేమ హాస్టల్లో తనకు దోస్తులు ఎక్కువ ఉండేవారని, భోజనం కూడా వారితో హాస్టల్లోనే తినేవాడినని చెప్పారు. తనకు ప్రొఫెసర్ లింబాద్రి సీనియర్ అని, వారితోనే ఎక్కువ గడిపేవాడినని అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు. డబ్బుతో ఏదీ కొనలేమని, ప్రొఫెసర్ లింబాద్రి విద్యనే నమ్ముకొని నేడు ఉన్నత విద్యామండలి చైర్మన్ అయ్యారని కొనియాడారు. ప్రొఫెసర్ లింబాద్రిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యను మించిన సంపద లేదని, శాశ్వతమైనది విద్య, నాలెడ్జ్ మాత్రమేనన్నారు. మంచి విద్య ఎంతో మంది ఉన్నతులను తయారు చేస్తుందన్నారు. తాను కూడా సివిల్ ఇంజినీర్ను కాబట్టే సీఎం కేసీఆర్ రోడ్లు, భవనాలు శాఖ ఇచ్చారని, సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణంలో కేసీఆర్ ఆదేశాల మేరకు భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
ఇతర పార్టీలకు రాజకీయం అంటే గేమ్ అని కేసీఆర్కు, తనకు మాత్రం ఒక టాస్క్ అన్నారు. రాజకీయాలు శాశ్వతం కాదని, ప్రశాంత్రెడ్డి ఉన్నప్పుడు ఏం చేసిండనేది ముఖ్యమన్నారు. కొంతమంది అల్పంగా మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు కాలేజీ అంటున్నారు, ఎన్నికల తర్వాత డిగ్రీ కాలేజీ పోతదా అని ప్రశ్నించారు. అంత కుంచిత మనస్తత్వంతో రాజకీయాలు చేసే వారిని అసలు పట్టించుకోనన్నారు. నా మీద ఎంత ఎక్కువ ఆరోపణలు చేస్తే అంత ఎక్కువ అభివృద్ధి పనులు చేస్తానని, దాంతో వారికే నష్టమన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రేపు అనే వరకు కూడా బాల్కొండ ని యోజకవర్గానికి అభివృద్ధి నిధులు తెస్తానని ప్రతినబూనా రు. డిగ్రీ కళాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి, ఎంపీపీ లావణ్యాలింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యావెంకటేశ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలస్వామి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నయ్య, విద్యాసాగర్ యాదవ్, కన్న పోశెట్టి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.
భీమ్గల్ జడ్పీటీసీ, ఎంపీపీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నాయకుడు కొండ ప్రకాశ్గౌడ్ అనారోగ్యంతో మంగళవారం మృతిచెందారు. భీమ్గల్ పట్టణంలో బుధవారం నిర్వహించిన అంత్యక్రియల్లో మంత్రి ప్రశాంత్రెడ్డి పాల్గొని పాడే మోశారు. ప్రకాశ్గౌడ్ పార్థివదేహంపై గులాబీ కండువా కప్పి నివాళులర్పించారు.
-భీమ్గల్,ఆగస్టు 30
నాకు చిన్నతనం నుంచి ఒక కాలు, ఒక చేతు సరిగ్గా పనిచేయదు. అయినా నేను బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. బాల్కొండకు డిగ్రీ కాలేజీ రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. డిగ్రీకి వేరే కాలేజీకి వెళ్లే స్థోమత లేదు. దేవుడు లాంటి కేసీఆర్, మంత్రి ప్రశాంత్రెడ్డి కృషితో బాల్కొండకు డిగ్రీ కళాశాల వచ్చింది. ఇక ఈజీగా డిగ్రీ చదువుతా. ఇప్పటికీ నాకు పెంచిన పింఛన్ రూ.4016 వస్తున్నది.
– ఆకాశ్, విద్యార్థి, బాల్కొండ