కమ్మర్పల్లి, సెప్టెంబర్ 22: తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే దిక్కు అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకే కాంగ్రెస్, బీజేపీ నాయకుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కమ్మర్పల్లి మండలం కోనాసముందర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్, అమీర్నగర్ గ్రామాల్లో సుమారు రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో మంత్రి వేముల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటా సంబురం కలిగిస్తున్నాయని తెలిపారు. పదేండ్లు రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ .. అప్పుడు సీఎం కేసీఆర్ ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ చెబుతున్న గ్యారెంటీలు ప్రజలను మభ్య పెట్టేవిధంగా ఉన్నాయని విమర్శించారు.
ఆ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోనే ఇస్తలేదన్నారు. మరి తెలంగాణలో ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కన్న తల్లికి తిండి పెట్టనోడు పిన్న తల్లికి బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం కావాలో అది చేస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మోసపూరిత హామీలు ఇవ్వడని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కుల వృత్తులకు ప్రోత్సాహంతో రైతులు, పేదలు, కుల వృత్తుల వారి మొహాల్లో నవ్వులు పూయించిన ఘనత కేసీఆర్దే అని స్పష్టం చేశారు. కేసీఆర్ను కాదని కరెంటు కోతల, కారు చీకట్ల కాంగ్రెస్ను కోరుకుంటామా అని ప్రశ్నించారు. ఓట్లు డబ్బాల పడ్డాక ముఖం చాటేసే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నమ్మ వద్దని కోరారు. తన తండ్రి వేముల సురేందర్రెడ్డి నుంచి తన వరకు కేసీఆర్నే నమ్ముకొని పనిచేస్తున్నామన్నారు. అందుకే ఆయనకు తమపై అమితమైన ప్రేమఉందన్నారు. ఆ ప్రేమను తన కోసం కాకుండా బాల్కొండ నియోజకవర్గం, ప్రజల కో సం వాడుతున్నానని మంత్రి వేముల తెలిపారు.