భీమ్గల్, నవంబర్ 20 : బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే ప్రజాసేవకు అంకితమవుతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజల మీద సీఎం కేసీఆర్కు ప్రేమ, బలం ఉన్నదని, దీంతో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ఇక ముందు కూడా పనులు చేపడుతామన్నారు. సోమవారం ఆయన భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్, సికింద్రాపూర్ తండా, గోన్గొప్పుల, గోన్గొప్పుల తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు తనపై ఉన్న ప్రేమ తన బాల్కొండ నియోజకవర్గానికి ప్రత్యేక బలమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రేమ, సహకారంతోనే నియోజకవర్గానికి సంబంధించిన ఏ పనులు ఆగలేదన్నారు. ఇక ముందు కూడా ఆగబోవని స్పష్టం చేశారు. భీమ్గల్ ప్రాంతంలో గత పాలకులు సాగునీటిపరంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని అన్నారు.
తన కన్నా ముందు వారు భీమ్గల్కు తాగునీటి వనరులను సృష్టించడంలో కనీసం ఆలోచన కూడా చేయలేకపోయారన్నారు. తాను వచ్చాక భీమ్గల్ ప్రాంతం మొత్తానికి శాశ్వతంగా ఉపయోగపడేలా ప్యాకేజీ- 21 పథకాన్ని తీసుకొచ్చానన్నారు. కేసీఆర్కు భీమ్గల్ ప్రాంత సాగునీటి ఇబ్బందులను ప్రత్యేకంగా వివరించామని గుర్తు చేశారు. అందుకే ప్యాకేజీ -21లో అంతకుముందున్న డిజైన్లో కాలువ ద్వారా నీరందించాలని ఉండేదన్నారు. అంచనా వ్యయం పెరిగినా వెనక్కి తగ్గకుండా పైపులైన్ మంజూరు ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు. భీమ్గల్ ప్రాంతానికి ఈ ప్యాకేజీ -21 శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు. గల్ఫ్ కార్మికులకు ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఆదుకోని విధంగా రూ.5లక్షల కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాల్కొండ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు తీజ్ భవనాలను సీఎం కేసీఆర్కు విన్నవించి మంజూరు చేయించానన్నారు. రాష్ట్రంలో తీజ్ భవనానికి మంజూరు అందుకున్న మొట్టమొదటి తండా భీమ్గల్ మండలం పెద్దమ్మకాడి తండాయేనని చెప్పారు. గోన్గొప్పుల, సికింద్రాపూర్ గ్రామాలకు చెక్డ్యామ్లను నిర్మించి వాగుల వెంట భూములకు శాశ్వతంగా భూగర్భజలాల భరోసా కల్పించినట్లు చెప్పారు. ఈ రెండు గ్రామాల్లో చెక్డ్యామ్ల నిర్మాణంతో బోరుబావులకు ఎండకాలంలో కూడా పుష్కలంగా నీటి సౌకర్యం ఉంటున్న విషయం ఇక్కడి రైతుల అనుభవంలో ఉందన్నారు. గోన్గొప్పుల గ్రామం గత ఎన్నికల్లో తనకు నియోజకవర్గంలోనే రెండో అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామమని గుర్తు చేశారు. వారందించిన మెజార్టీ, ప్రేమను గుర్తుంచుకుంటూ అడిగనవి, అడగని పనులు చేసి పెట్టానన్నారు. రేకులపల్లి, బీరప్ప రోడ్లను చేయిస్తానన్నారు. లో లెవల్ కాజ్వేను సౌకర్యవంతంగా మార్పు చేయిస్తానన్నారు. ఈ గ్రామాలకు 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాళ్లు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేసి, బిందెడు నీళ్ల కోసం మహిళలు పడుతున్న తిప్పలను దూరం చేశామన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్ సమస్యలు తొలగిపోయాయన్నారు. ప్రతిఒక్కరికీ పూర్తి రుణమాఫీ అందుతుందని స్పష్టం చేశారు. విపక్షాలు ప్రతి ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇస్తామని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. వారు పాలిస్తున్న కర్ణాటక, మహారాష్ట్రలో ఇంటికి ఒక్క పింఛనే దిక్కు లేదు కానీ ఇక్కడ రెండు పింఛన్లని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, కారు గుర్తు పార్టీకి ఓటు వేసి మళ్లీ తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజాసేవకు అంకితమై రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానన్నారు. గ్రామాల్లో మంత్రి వేములకు వల గొడుగులు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. గోన్గొప్పులలో వేములకు గొల్ల, కుర్మలు గొర్రెపిల్లను బహూకరించారు. ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.