భీమ్గల్, నవంబర్ 25 : భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్, మానాల తదితర గుట్ట మీద ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం భీమ్గల్, వేల్పూర్ మండలాల్లో పర్యటించారు. ఉదయం భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్, తాళ్లపల్లి, గంగరాయి, కొత్తతండా, సాయంత్రం వేల్పూర్తోపాటు మోతెలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్, కారేపల్లి తదితర గ్రామాల్లో పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించినట్లు తెలిపారు. 780 పోడు, 580 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించినట్లు చెప్పారు. ఈ భూములకు గతంలో రైతుబంధు ఇతర ప్రయోజనాలు అందక రైతులు బాధపడేవారన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేశానన్నారు. ఈ గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధిపనులు చేపట్టినట్లు వివరించారు. కాలు తీసి బయట పెడితే బురద ఉండే రోడ్ల స్థానంలో కాలికి బురద అంటకుండా తండాల్లో రోడ్లు, బీటీ రోడ్లు వేయించినట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులు దూరం చేశానన్నారు. గతంలో వాగులకు చెలిమల వద్దకు నీటి కోసం వెళ్లాల్సిన దుస్థితిలో తండాలుండేవని గుర్తు చేశారు. దేవక్కపేట్, మానాల తదితర గుట్టల మీద ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు కృషిచేస్తానని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంజినీర్లు, ఆఫీసర్లు, గ్రామస్తులతో కలిసి పరిశీలిస్తామన్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్కు వివరించి సాధ్యమయ్యేలా చూస్తానన్నారు. అసైన్డ్ పట్టాలు కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాలేదని, గ్రామస్తుల బాధలు చూసి సాధ్యం చేశానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఘనస్వాగతం లభించింది.
భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామ మున్నూరుకాపు సంఘం సభ్యులు ఎన్నికల్లో వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు శుక్రవారం దేవక్కపేట్కు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి తీర్మాన కాపీని సంఘ సభ్యులు అందజేశారు.