మోర్తాడ్/ ఏర్గట్ల, సెప్టెంబర్ 7: కేసీఆర్ పాలనలో పారదర్శకంగా, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మోర్తాడ్ రైతువేదికలో తిమ్మాపూర్ (85 మంది), పాలెం(95),ఏర్గట్ల రైతువేదికలో తడ్పాకల్ (31), తాళ్లరాంపూర్(31మంది) గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ స్థలాలు లభించిన వారందరికీ గృహలక్ష్మి ద్వారా విడుతల వారీగా ఇండ్లు వచ్చేలా చూస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ ఏపార్టీ వారైనా తెలంగాణ బిడ్డలే గదా అని అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరుగుతూ రూ. 4వేల పింఛన్ ఇస్తామని చెబుతున్నారని, కానీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో మాత్రం కేవలం రూ.750 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.
మరి తెలంగాణలో ఎలా ఇస్తారో ఆలోచన చేయాలన్నారు. 2014కు ముందు కేవలం వృద్ధులకు మాత్రమే రూ.200 ఇచ్చేవారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక రూ. 2వేల పింఛన్తోపాటు అప్పటికన్నా రెండింతల మందికి ఇస్తున్నట్లు తెలిపారు. బీజేపీ రాకముందు ఉన్న ధరలకు.. ఇప్పుడు ఉన్న ధరలకు చాలా తేడా ఉన్నదని తెలిపారు. దీనంతటికీ కారణం బీజేపీయేనని ఆరోపించారు. బీజేపీ రాకముందు సిలిండర్ ధర రూ.400 ఉంటే ఇప్పుడు రూ.1200 అయ్యిందని, డీజీల్, పెట్రోల్ ధరలు రెండింతలయ్యాయని తెలిపారు. దీంతో ఇంట్లో వాడే ప్రతి వస్తువు ధర రెండింతలయ్యిందని, ప్రతి ఇంటికీ నెలకు రూ.4వేలకు పైగా భారం పడుతుందని చెప్పారు. బీజేపీ తొమ్మిదేండ్ల పాలనలో మంచేమి జరిగిందో ఆలోచించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతి పక్ష పార్టీలకు నిద్ర పట్టడం లేదన్నారు. ప్రతి పక్ష పార్టీల నాయకులు మాయ మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్,బీజేపీ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు లేవన్నారు. పింఛన్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
స్వరాష్ట్రంలో మారిన గ్రామాల రూపురేఖలు
తెలంగాణ రాకముందు గ్రామాలు ఎలా ఉండే.. స్వరాష్ట్రంలో ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. ప్రతి పల్లెలో సీసీ రోడ్లు కనిపిస్తున్నాయన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఎవరెన్ని మాయమాటలు, కట్టుకథలు చెప్పినా కండ్లకు కనిపిస్తున్నవాటినే నమ్మాలన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 62వేలమందికి పింఛన్లు, 10వేల మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తారని తెలిపారు.
మోర్తాడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీవో వినోద్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఏఎంసీ వైస్చైర్మన్ పాపాయి పవన్, వైస్ ఎంపీపీ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ కళ్లెం అశోక్, సర్పంచులు బోగ ధరణి, గడ్డం చిన్నారెడ్డి, సంతోష్, ఎంపీటీసీలు అస్మాఅజారుద్దీన్, రాజ్పాల్, ఉప సర్పంచులు నవీన్, పల్గిరి రవి తదితరులు పాల్గొన్నారు.