కమ్మర్పల్లి, నవంబర్ 11 : ‘మానాలను అభివృద్ధి పథంలో నిలుపుతానని మాటిచ్చాను..రూ.100కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన.. చెప్పిన మాట నిలబెట్టుకున్న..మీ కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి..’ అని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. శనివారం ఆయన బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మానాలతో పాటు బడితండా, దేగావత్తండా, భీమ్గల్ మండలం పల్లికొండ, బాచన్పల్లి, పిప్రి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కులసంఘాల నాయకులు, మహిళలు మంగళహారతులు, బతుకమ్మలు, బోనాలు, డప్పుచప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. మానాల గిరిజనులను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఓట్ల కోసం వాడుకున్నాయే తప్ప అభివృద్ధి అందించలేదన్నారు. మానాలకు బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి చేత హామీ ఇప్పించి మాట తప్పిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు.
కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో గిరిజన ఆశ్రమ పాఠశాలను నిర్మించడంతోపాటు మానాల మరిమడ్ల రోడ్డు నిర్మించి గిరిజనుల 60 ఏండ్ల కలను నెరవేర్చామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా మా నాలకు 2200 ఎకరాల పోడు పట్టాలు ఇచ్చామన్నారు. ఉమ్మడి మానాల పరిధిలోని 16 తండాల నుంచి 8 తండాలను గిరిజన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. ఫలితంగా ఇక్కడ 8 మంది సర్పంచులు, 8 మంది ఉప సర్పంచులు, 40 మంది వార్డు సభ్యులుగా గిరిజన బిడ్డలు ఎన్నికయ్యే అవకాశం కలిగిందన్నారు. కర్ణాటకలో వ్యవసాయానికి 10 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఓట్లు వేయించుకొని, అప్పటికే ఉన్న ఏడు గంటల కరెంటును ఎగ్గొట్టిందన్నారు. బీజేపీ అధికారంలోఉన్న మహారాష్ట్రలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కావాలంటే రూ.1.80 లక్షలు కట్టాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఉచితంగా కరెంటు ఇస్తూ ఉల్టా పైసలను పంట పెట్టుబడికి అందిస్తున్నారని గుర్తు చేశారు. కర్ణాటక, మహారాష్ర్టాలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. కావాలంటే మానాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆ రెండు రాష్ర్టాలకు వెళ్లి వచ్చి మానాలలో అమర వీరుల స్తూపం వద్ద నిజం చెప్పాలని సూచించారు. తాను చెప్పింది నిజమే అయితే వారు కూడా కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
కేసీఆర్ మూడోసారి సీఎం కాగానే ఐదేండ్లలో పింఛను రూ.5 వేలకు, రైతు బంధు రూ.16 వేలకు పెరుగుతుందని తెలిపారు. భూమి లేని వారు దురదృష్టవశాత్తు ఎలా మరణించినా రైతు బీమా మాదిరిగానే కేసీఆర్ బీమా పథకం కింద రూ.5 లక్షలు అందిస్తారన్నారు. ఎలాంటి పింఛన్రాని మహిళలకు ప్రతి నెలా రూ.3 వేలు సౌభాగ్యలక్ష్మి పథకం కింద అందజేస్తారని తెలిపారు. మానాలలో ఉద్యమ కాలం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మోసపు మాటలు నమ్మవద్దన్నారు. అభివృద్ధిని చూసి, ఆలోచించి ఓటేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, తండాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకులు నరేశ్ నాయక్, రాజారామ్, భూమా నాయక్, లక్కాకుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్, నవంబర్ 11 : అభివృద్ధి చేసిన వారిని ఆదరించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం భీమ్గల్ మండలంలోని పల్లికొండ, బాచన్పల్లి, పిప్రి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు గ్రామాల్లో గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో చేసి అభివృద్ధి ప్రజల కండ్ల ముందే ఉన్నదని తెలిపారు. అభివృద్ధిని గుర్తించి కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.