ఆర్మూర్, మే 26: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్తోనే దేశం, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నంబర్ వన్గా తీర్చిదిద్దారని వివరించారు. నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మె ల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం బీఆర్ఎస్ నందిపేట, డొంకేశ్వర్ మండ ల స్థాయి కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మం త్రి వేముల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నరేంద్ర మోదీ అసమర్థ ప్రధాని అని, ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడని విమర్శించారు. తన మిత్రుడు అదానీ కోసం ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో రూ.3వేలకు దొరికే బొగ్గును రూ.30వేలకు కొనాలని విద్యుత్ డిస్కంలకు హుకూం జారీ చేశారని మండిపడ్డారు. ఎల్ఐసీ, ఎస్బీఐ, విమానాశ్రయాలు, ఓడ రేవులు, ఇతర ప్రభుత్వరంగ సంస్థలను మోదీ తన కార్పొరేట్ మిత్రులకు అప్పనంగా కట్టబెడుతూ దేశ సంపదను దోచి పెడుతున్నారని మంత్రి ఆరోపించారు.
మోదీ వల్ల దేశంలో ఒక్క వర్గానికీ మేలు జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, కులవృత్తులకు ప్రోత్సాహకాలు ఇలా అనేక పథకాలు ఇస్తూ ప్రజల ఇండ్లకే నేరుగా డబ్బులు పంపిస్తుంటే.. ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ , పప్పు, ఉప్పు నిత్యావసర ధరలు పెంచి ఇంట్లో ఉన్న పైసలు గుంజుకొని సామాన్య ప్రజలను గోస పెడుతున్నారన్నారు. పసుపు బోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను మోసం చేసి గెలిచిన ఎంపీ అర్వింద్ పత్తాలేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలన గురించి మాట్లాడే కనీస అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు లేదని మంత్రి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సహకారంలో జీవన్రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయాల నిధులతో అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. ఒక్క నందిపేట మండల మీటింగ్.. నియోజకవర్గస్థాయి మీటింగ్ను తలపిస్తోందని, ఉద్యమ సమయంలో 50 మంది మాత్రమే టీఆర్ఎస్ సభ్యులు ఉండేవారని నేడు 3వేల మంది అయ్యారని గుర్తు చేశారు. నందిపేట్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే జీవన్రెడ్డితో చర్చించి త్వరలో సీఎం కేసీఆర్తో కలిసి ఆర్మూర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమని, అభివృద్ధి ఆయన మతమని, సంక్షేమం కులమని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ తనకు వెయ్యి ఏనుగుల బలమని, బీఆర్ఎస్ కార్యకర్తలే తన ఆత్మీయ బలగమని వివరించారు. తెలంగాణ మోడల్ కర్త, కర్మ, క్రియ కేసీఆరేనన్నారు. కాంగ్రెస్ అవినీతి, బీజేపీ మత కాలుష్య పార్టీలని, తెలంగాణ పచ్చదనంపై దాడికి వస్తున్న కాంగ్రెస్, బీజేపీ మిడతల దండును తరిమికొట్టాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రెండు పార్టీల్లో ఏదొచ్చినా అభివృద్ధి, సంక్షేమం మాటుమాయం అవుతా యన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై విషం చిమ్ముతున్న విపక్షాలకు ఎదురుదెబ్బ తప్పదని జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధికి అసలైన ఆనవాలుగా ఆర్మూర్ను నిలిపానని, రూ.2500 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు.
ఆర్మూర్ గతంలో ఎట్లుంది..ఇప్పుడెట్లుందన్న దానిపై చర్చ జరగాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ అయిందని, ఆలూర్, డొంకేశ్వర్ కొత్త మండలాలుగా ఏర్పాటయ్యాయని అన్నారు. మూడోసారి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని జీవన్రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. అనంతరం మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ అధికారం బీఆర్ఎస్దేనని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలను ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఆయన సతీమణి రజితారెడ్డి తెలుసుకున్నారు. అనంతరం నూతన దుస్తులు అందజేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, సీనియర్ నాయకులు రాజారాం యాదవ్, కోటపాటి నర్సింహనాయుడు, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.