కమ్మర్పల్లి, మే 24 : రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో బుధ, గురువారాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో టీఆర్ఎస్ బలపర్చిన రాజ్యసభ సభ్యుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కొంపల్లి హైందవ గౌరిక్ కన్వెన్షన్లో జరుగు మంత్రి ఓఎస్డీ విజయేందర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు.
సాయంత్రం నాలుగు గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పోలీస్ రిక్రూట్మెంట్ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు మంత్రి తన సొంత నిధులతో సమకూర్చిన స్టడీ మెటీరియల్ అందజేస్తారు. గురువారం ఉదయం 10 గంటలకు వేల్పూర్ మండలం పడగల్ హనుమాన్ నగర్ గ్రామ పంచాయతీ వద్ద తాను సొంతంగా ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో స్టడీ మెటీరియల్ అందజేసే కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు వేల్పూర్ మార్కెట్ కమిటీ వద్ద దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లు, చెక్కులను అందజేస్తారు. అనంతరం భీమ్గల్, చేంగల్లో పలు శుభకార్యాల్లో మంత్రి వేముల పాల్గొంటారు.
కమ్మర్పల్లి, మే 24: హైదరాబాద్లో మంగళవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి- నీరజారెడ్డి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ కోకాపేటలోని తన మిత్రుని నివాసంలో స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో సతీ సమేతంగా పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.