నిజామాబాద్ : భారీ వర్ష సూచన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు తమతమ అధికారులు, సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పటికీ విరామ సమయంలో సోమవారం ఉభయ జిల్లాల్లో వర్ష పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఫోన్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్లు నారాయణ రెడ్డి, జితేష్ వి పాటిల్తో మాట్లాడారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఉభయ జిల్లాల్లో అత్యవసర సేవలు అందించే శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస చర్యలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా భారీ వర్ష సూచనపై హెచ్చరికలు జారీ చేయాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో పలు మార్లు భారీ వానలు కురిసినప్పటికీ జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ఎటువంటి ప్రమాదాలకు వెలుగు చూడలేదని చెప్పారు. అదే స్ఫూర్తితో పని చేసి తుఫాన్ గండం నుంచి బయట పడేలా పని చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్, రోడ్డు – భవనాలు, పంచాయతీ రాజ్, రెవెన్యూ, మున్సిపాలిటీ, వ్యవసాయ, ఎలక్ట్రిసిటీతో పాటుగా ఇతర శాఖల అధికారులు మరింత ప్రమత్తంగా ఉండాలని మంత్రి వెల్లడించారు.
అదేవిధంగా ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పరిస్థితులను అంచనా వేయాలన్నారు. ఆది, సోమవారాల్లో కురిసిన వానలతో గోదావరిలోకి ప్రవాహం పెరిగే ఆస్కారం ఉందని మంత్రి తెలిపారు. గోదావరి ప్రవాహానికి తగ్గట్లుగా ఎస్సారెస్పీ అధికారులు చర్యలు తీసుకుంటారని దిగువ ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చూడాలని చెప్పారు. ఎస్సారెస్పీ పరివాహక ప్రాంత ప్రజలను, నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండవల్సిందిగా హెచ్చరికలు జారీ చేయాలని తెలిపారు.