బీబీపేట్, సెప్టెంబర్ 15 : మండలంలోని కోనాపూర్ గ్రామానికి ఈ నెల 25న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం సాయంత్రం గ్రామంలో పర్యటించారు. కార్పొరేట్ స్థాయిలో నిర్మించిన పాఠశాల, గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి, సీసీ రోడ్లు, పైప్లైన్లతోపాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. సభావేదిక, వాహనాల పార్కింగ్, భోజన ఏర్పాట్ల కోసం స్థలాలను పరిశీలించారు.
ముస్తాబవుతున్న గ్రామం
మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా గ్రామం ముస్తాబవుతున్నది. ఇప్పటికే గ్రామంలోని ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. ఆధునిక హంగులతో సర్వాంగ సుందరంగా మారింది. మంత్రి కేటీఆర్ తన నానమ్మ జ్ఞాపకార్థం రూ.2.50 కోట్లతో పాఠశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. పనులు కూడా పూర్తయ్యా యి. గ్రామ శివారులో రహదారిపై ఉన్న వంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ రూ. 2.40 కోట్లు మంజూరు చేయడంతో వంతెన పనులు పూర్తికాగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. మంత్రి కేటీఆర్ తన నానమ్మ ఊరిని దత్తత తీసుకొని సొంతంగా రూ.5 కోట్ల నిధులతో గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేయించారు. ఈ అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ విప్ వెంట బీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్,్ల జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలమణి, సర్పంచ్ నర్సవ్వ, ఎంపీటీసీ రవి, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
ఎంపీవో కృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్మికులతో గ్రామంలో శుక్రవారం పిచ్చి మొక్కలను తొలగించి, పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేయించారు. మంత్రి కేటీఆర్ పూర్వీకుల ఇంటి పక్కన ట్రాక్టర్తో పిచ్చి మొక్కలను తొలగించారు. గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలను ఎంపీవో నాటించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు భరత్, నవీన్, వెంకటస్వామి, బాలకృష్ణాగౌడ్, కళ్యాణ్, శ్రీనివాస్, రమేశ్, ఇంతియాజ్, వెన్నెల, శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.