నిజామాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కామారెడ్డి నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందిన కేసీఆర్కు కామారెడ్డిలో గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా ఉండగా, భారీ మెజార్టీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జిగా ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఇతర సమన్వయ కమిటీ సభ్యులంతా కలిసి భారీ మెజార్టీ కోసం శ్రమిస్తున్నారు. మండలాల వారీగా ఇన్చార్జిలను, 266 బూత్లకు బాధ్యులను ఇప్పటికే నియమించిన గులాబీ పార్టీ… రోజువారీగా శ్రేణులతో మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నది. చేరికలతోపాటు ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్న వేళ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో మరింత ఉత్సాహాన్ని అందించనున్నది. శనివారం కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరు, బీబీపేట మండలాల్లో కేటీఆర్ పర్యటిస్తారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో కామారెడ్డిలో శ్రేణులంతా కలిసి గులాబీ బాస్కు భారీ మెజార్టీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా వచ్చి పోటీ చేస్తామంటే తామంతా మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించుకుంటామంటూ నియోజకవర్గమంతా ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానాలు చేసి మద్దతు తెలిపింది. మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట, రాజంపేట, రామారెడ్డి, కామారెడ్డి మండలాల్లో భారీ ఎత్తున కుల సంఘాలు, గ్రామ పంచాయతీల వారీగా ఇప్పటికే తీర్మానాలు జరిగాయి. దీంతో కేసీఆర్ గెలుపు ఖాయమైనప్పటికీ మెజార్టీ మాత్రం భారీగా రావాలనే సంకల్పంతో బీఆర్ఎస్ కృషి చేస్తున్నది. కామారెడ్డి నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ఈ ప్రాంతంపై దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో పలు దఫాలుగా సమావేశాలు, మండలాల వారీగా పార్టీ శ్రేణులతో సమీక్షలు, అంతర్గత సమావేశాలను నిర్వహించారు. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను తిప్పి కొట్టేందుకు వ్యూహాలను రచిస్తూ అమలు చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ చేపట్టబోయే రోడ్షోలు నేరుగా ప్రజలతో ముఖాముఖి అన్నట్లుగా నిర్వహించబడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ తలపెట్టిన రోడ్ షోలకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి ప్రసంగాన్ని ఆలకిస్తున్నారు. కేటీఆర్ చెప్పే విషయాలను ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి మరోసారి జై కొట్టేందుకు సంసిద్ధులు అవుతున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 11గంటలకు భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి నుంచి రోడ్షో మొదలవుతోంది. పలు గ్రామాల్లో ఒపెన్ టాప్ బస్సు ద్వారా పర్యటిస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగాన్ని కేటీఆర్ చేస్తారు. కాంగ్రెస్, బీజేపీ చేష్టలను, ఆ పార్టీల వైఖరిని తనదైన శైలిలో కేటీఆర్ తిప్పికొట్టబోతున్నారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ రాక సందర్భంగా వచ్చే ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి జరుగబోయే మేలును వివరించనున్నారు. నవంబర్ 9న జరిగిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ అఖండ విజయం సాధించిన తర్వాత జరుగుతున్న కేటీఆర్ కార్యక్రమాలను దిగ్విజయం చేసేందుకు బీఆర్ఎస్ నేతలంతా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం ప్రచార సభ మాదిరిగానే రోడ్ షోను విజయవంతం చేసేందుకు ఇప్పటికే శ్రేణులను సమాయత్తం చేశారు. మధ్యా హ్నం 2గంటలకు బీబీపేట మండలంలోని కాచాపూర్, మాందాపూర్, జనగామ గ్రామాల్లో రోడ్ షో ఉంటుంది. 3గంటలకు బీబీపేట మండల కేంద్రంలో ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రసంగిస్తారు.