నిజామాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బాన్సువాడ : రాష్ట్రంలో మరే ఇతర నియోజకవర్గంలో లేని విధంగా సుమారు రూ.10 వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన లక్ష్మీ పుత్రుడు పోచారం సీనన్నను లక్ష మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం బాన్సువాడ పట్టణంలో రూ.135 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. అనంతరం వారాంతపు సంతలో ఏర్పాటు చేసిన ఆత్మీయ కృతజ్ఞత సభలో ప్రసంగించారు. కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో పేదల కోసం 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూ రు చేయించుకున్న గొప్ప వ్యక్తి, మాలాంటి ఎందరో యువనాయకులకు పితృ సమానులు స్పీకర్ పోచా రం సీనన్న అని తెలిపారు.
1976లో రాజకీయాల్లోకి వచ్చిన సీనన్న సుమారు 40 సంవత్సరాలు ఆయా ప్రభుత్వాల పని తీరుపై సీనన్న అడగగా ఎంతో మంది సీఎంలు, ప్రభుత్వాలను చూశానని ప్రజల మౌలిక వసతుల కోసం సీఎంలకు దండాలు పెట్టినా, యుద్ధాలు చేసినా నిధులు ఇవ్వలేదని కన్నీరు పెట్టుకున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ సభలో గుర్తు చేశారు. ఆకాశం నుంచి భువికి గంగ ను తీసుకొచ్చిన విధంగా సీఎం కేసీఆర్ వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి కాళేశ్వరం నీటిని తెచ్చి పైన ఉన్న ఎస్సారెస్పీ, నిజాంసాగర్లను నిండుకుండలుగా మార్చారని, రైతులకు రెండు పంటలకు సరిపడా నీటినందించి బీడు భూములను సస్యశ్యామలం చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న పోచారం హయాంలోనే రైతుబంధు పథకాన్ని తెచ్చారని వారి మనుమళ్లు, మునిమనవళ్లు దర్జాగా చెప్పుకోవచ్చని తెలిపారు. అంతేకాకుండా బాన్సువాడ నియోజకవర్గంలో తొమ్మిదిన్నరేండ్లలో రూ.పది వేల కోట్లతో స్పీకర్ పోచారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ పైసలిస్తే కడుపునిండా తీసుకొని ఓటు కారుకు వేయండి..
బాన్సువాడ ప్రజలు ఆలోచన చేయండి బాన్సువాడ బాగుపడ్డదా…..పాడయ్యిందా అని మంత్రి కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల గుజరాత్ నుంచి బీజేపీ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీల నాయకులు డబ్బులు భారీగా తెస్తున్నారని, వాళ్లు పైసలిస్తే ప్రజలు కడుపునిండా తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం కారు గుర్తుపై పోచారం సీనన్నకు వేయాలని ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 70 ఏండ్లలో ఆయా పార్టీలు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సహకారంతో స్పీకర్ పోచారం తొమ్మిదిన్నరేండ్లలో బాన్సువాడ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని మంత్రి కొనియాడారు.
ఎన్నికలు వస్తే ఒక్కసారి అవకాశం ఇవ్వమని మోపవుతారని, 60 ఏండ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు తాగు, సాగునీరు ఇవ్వడం చేతకాని పార్టీలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏం చేస్తారన్నారు. ‘గూట్ల రాయిని తీయనోడు…..యేట్ల రాయిని తీస్తా డా’ అంటూ ఆయా పార్టీలకు చురకలు అంటించారు. ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రానున్నదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పేరిట ఇండ్లను ఇచ్చారని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు ఇచ్చారని కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షల నాలుగు వేలు అందించిందని తెలిపారు. ఒక బాన్సువాడలోనే 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు మంజూరయ్యయంటే, ఇందిరమ్మ ఇండ్లు 70 వేల వరకు ఇచ్చినట్టేనని మంత్రి కేటీఆర్ లెక్కలు చెప్పారు.
మోదీతో తెలంగాణకు ఒరిగింది సున్నా..
తెలంగాణకు మోదీతో తొమ్మిదిన్నరేండ్లలో ఒరిగింది సున్నానేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ర్టానికి ఒక్క కాలేజీ ఇయ్యలేదు.. స్కూల్ ఇయ్యలేదు. పైసల్ ఇయ్యలే. మన పైసలతో ఉత్తరప్రదేశ్, బీహార్లో రోడ్లు వేసుకుంటున్నాడంటూ మండిపడ్డారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే మనకు తిరిగి వస్తున్నది కేవలం 46 పైసలు మాత్రమేనని వివరించారు. ఎవరు ఎవరి పైసలతో సోకులు పడుతున్నరో మోదీ చెప్పాలన్నారు. జూటా మాటలు. బూతులు తిట్టి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే జాకీలు పెట్టినా బీజేపీ ఇక్కడ లేవదన్నారు. బీజేపీ పని అయిపోయిందని చెప్పారు.
థర్డ్ క్లాస్ ఫెల్లో రేవంత్ రెడ్డి…
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక థర్డ్ క్లాస్ ఫెల్లో అంటూ కేటీఆర్ సంబోధించారు. ఓటుకు నోటులో దొరికినోడి కథే ఇప్పుడు సీటుకు నోటు నడుస్తున్నదని కాంగ్రెసోళ్లే చెబుతున్నారని చెప్పారు. ఇలాంటోడు రాష్ర్టాన్ని టోకుగా అమ్మేయ్యడా. ఇసుంటోడి చేతి లో రాష్ట్రం పెడుతామా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్ననాడు రూ.200 పింఛన్ ఇచ్చినోడే ఇప్పుడు రూ.4వేలు ఇస్తానంటే నమ్ముదామా అని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటవుతున్నాయ ని గత ఎలక్షన్లా నిజామాబాద్, కరీంనగర్లో అదల్ బదల్ మాదిరిగా ఓట్లేసుకున్నారని గుర్తు చేశారు. ఈ పార్టీలకు బుద్ధి చెప్పాలని కోరారు.
కేసీఆర్ వెంట కోట్లాది మంది జనం…
నిన్న నిజామాబాద్కు వచ్చిన ప్రధాని హోదా మరిచి వ్యాఖ్యలు చేశారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. పీఎం అంటే హోదా. హుందాతనం ఉండాలి. నిజం ఉండాలి. స్పష్టత ఉండాలి. గల్లీ మనిషిలా ఢిల్లీ నుంచి నిజామాబాద్కు వచ్చి పిచ్చిమాటలు మాట్లాడారని తెలిపారు. కేటీఆర్ సీఎం కావాలంటే మోదీ అవసరం లేదని, మా ఎమ్మెల్యేలు లేమా అంటూ ప్రశ్నించారు. హోష్లో ఉండి మాట్లాడిండా అంటూ అనుమా నం వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో 105 బీజేపీ స్థానాలకు డిపాజిట్ రాలేదని ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉం టుందన్నారు. కేసీఆర్ వెంట కోట్లాది మంది ఉన్నారనే భయంతోనే మోదీ వ్యాఖ్యలు చేశారని చెప్పా రు. ఐటీ సెక్టార్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన వ్యక్తి కేటీఆర్ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో సాగునీరు, తాగునీరు, రోడ్లు, చెక్డ్యామ్లు, లిఫ్ట్ ఇరిగేషన్, వైద్యం, విద్య, సంక్షేమ కార్యక్రమాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు సాధించుకున్నామని చెప్పారు.
ఇవన్నీ కలుపుకొని లెక్కగడితే రైతుబీమా 14వేల మందికి, కల్యాణలక్ష్మి 15వేల మందికి, కేసీఆర్ కిట్లు 30వేల మందికి, డబుల్ బెడ్ రూం 11వేల మందికి, గొర్లు 7500 మందికి, 250 చెరువుల్లో ఉచిత చేపపిల్లలు. మొత్తం 9 ఏండ్లలో కేసీఆర్ వచ్చాక ఫలాల విలువ రూ.10 వేల కోట్లకు చేరిందని చెప్పారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా 500 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకున్నామని తెలిపారు. బాన్సువాడలో ముగ్గురు ఎమ్మెల్యేలు అంటూ పిచ్చి కూతలు కూసిన వారిపై పోచారం మండిపడ్డారు. ఒక కూలీకి ముగ్గురం పని చేస్తున్నామని చెప్పారు. అలాంటి పిచ్చివాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. తాను ప్రజలకు బాకీ లేనని, ప్రజలే ఓటు రూపంలో బాకీ ఉన్నారని స్పీకర్ అభివర్ణించారు. ఓటేసి బాకీ తీర్చుకుంటే మళ్లీ ప్రజలకు అభివృద్ధి రూపంలో బాకీ ఉంటానంటూ పోచారం చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, ఐడీసీ చైర్మన్ వేణుగోపాల చారి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దఫేదార్ రాజు, పోచారం సురేందర్ రెడ్డి, డాక్టర్ పోచారం రవీందర్ రెడ్డి, రైతుబంధు సమతి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.