కంఠేశ్వర్/సిరికొండ/దోమకొండ/భిక్కనూరు, మార్చి 21: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు పరిహారం అందజేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని భిక్కనూరు, దోమకొండ, సిరికొండ మండలాల్లో గురువారం పర్యటించిన మంత్రి.. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో అధికారులు గ్రామాల వారీగా నివేదిక తయారు చేస్తున్నారని తెలిపారు. నివేదిక అందగానే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు అందిస్తామన్నారు. రైతుల పంటలకు ప్రమాదబీమా చేసి దానికి సంబంధించిన ప్రీమియం మొత్తం ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఒకేసారి అమలుచేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.