ఖలీల్వాడీ, డిసెంబర్ 26 : ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ‘ప్రజాపాలన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు చేపట్టనుండడంతో నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మ ంత్రి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. దశాబ్దాల పాటు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తమ సమస్యలు పరిష్కారమవుతాయని, కష్టాలు తొలగిపోతాయని ఎంతో ఆశతో ఉన్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారి సమస్యలను తీర్చి బడుగు, బలహీన వర్గాల ఆర్థిక ప్రగతికి తోడ్పాటునందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని రూపొందించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిందన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పారదర్శకంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చే యాలని హితవు పలికారు. ప్రజలన నుంచి వచ్చే దరఖాస్తులను స్వీకరించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు.
ప్రతి పేదవాడికీ తప్పనిసరిగా న్యాయం జరగాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించేలా ప్రజాప్రతినిధులు, మీడియా, సోషల్ మీడియాలో యువత కూడా తమ వంతు చొరవ చూపాలన్నారు. క్షేత్రస్థాయిలో సంపూర్ణ సమాచారాన్ని సేకరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, తద్వారా అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి జూపల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారికి మేలు చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రజాపాలనలో తొక్కిసలాటలు, రద్దీ వంటి వాటికి ఆస్కారం లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పోలీసుశాఖ కూడా సంపూర్ణ భాగస్వామ్యం అయి, ప్రజాపాలన అమలు కోసం పటిష్ఠ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, అర్వింద్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూ కిరణ్, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ , వెంకటరమణారెడ్డి , కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, మనూ చౌదరి, మున్సిపల్ కమిషనర్ మకరంద్, ఉభయ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఖలీల్వాడి, డిసెంబర్ 26: అనుమతి లేకుండా, ప్రజలకు నష్టం కలిగించేలా కొనసాగుతున్న అక్రమ మైనింగ్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. సమీక్ష కోసం నిజామాబాద్కు వస్తున్న సందర్భంలో కామారెడ్డిలో పలువురు బాధితులు మాచారెడ్డి ఉమ్మడి మండలాలకు చెందిన అక్రమ మైనింగ్పై ఫిర్యాదు చేసినట్లు మంత్రి తెలిపారు. భారీ పేలుళ్లతో వందలాంది బోరుబావులు, నివాసాలు దెబ్బతిన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారని అన్నారు. కొన్నేండ్లుగా అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్ జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదని సంబంధిత అధికారులను ఆరా తీశారు. తక్షణమే విచారణ చేపట్టి వారం రోజుల్లో సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
అక్రమ మైనింగ్తో నష్టపోయిన బాధితులకు మైనింగ్ యాజయాన్యం ద్వారా పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.