ఖలీల్వాడి/ విద్యానగర్, జనవరి 16 : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19వ తేదీ నుంచి ప్రతిష్టాత్మ కంగా చేపట్టనున్న కంటివెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ అంజనీకుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఏర్పాటు చేసిన వీసీ ద్వారా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంటకు రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. మరుసటి రోజైన 19న మిగతా అన్ని జిల్లాల్లో ఉదయం 9 గంటలకు కంటి వెలు గు శిబిరాలను ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచిం చారు. ఎక్కడికక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆహ్వానించి నిర్దేశిత ప్రాంతాల్లో శిబిరాలు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. శిబిరాల వద్ద తోపులాటలు, గలాటాలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. ప్రతి శిబిరం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. శిబిరాల వద్ద ఒకేసారి ప్రజలు గుమిగూడకుండా ప్రణాళికాబద్ధంగా, క్రమపద్ధతిలో కంటి పరీక్షలు నిర్వహించుకునేలా వ్యవహరించాలని సూచించారు. ప్రతిరోజూ కనీసం 120 నుంచి 130 మందికి నేత్ర పరీక్షలు చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధిగా శిబిరాలు కొనసాగాలని సూచించారు. వైద్యబృందాలు ఉదయం 8.45 గంటలకు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉదయం 8 గంటలకే శిబిరాల వద్దకు చేరుకోవాలని ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్నిశాఖలు సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ మొదటి విడుత కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విధంగా అదే తరహా స్ఫూర్తితో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ చొరవ చూపాలన్నారు.
ప్రజలు సంతృప్తి చెందేలా శిబిరాల్లో నాణ్యతతో కూడిన సేవలందించాలని, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను అప్పటికప్పుడే అందించాలన్నారు. శిబిరాల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్ నుంచి వీసీలో సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్వో డాక్టర్ సుదర్శనం, డీపీవో జయసుధ, మున్సిపల్ కమిషనర్లు, కామారెడ్డి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వీసీలో కలెక్టర్ జితేశ్ పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, డీఆర్డీవో సాయన్న, డీపీవో శ్రీనివాస్ రావు, మున్సిపల్, పంచాయ తీరాజ్ అధికారులు పాల్గొన్నారు.