ఆదిలాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ) : యువతరం గర్జించింది. విద్యార్థి లోకం కదలివచ్చింది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా యువతీయువకులు సభకు హాజరయ్యారు. “మా సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలి. వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐని మూసివేస్తే చూస్తు ఊరుకోం. బీఆర్ఎస్ పార్టీ తెరవడానికి సంపూర్ణ సహకారం అందిస్తే.. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తెరుచుకోకుండా అడ్డుకుంటున్నాయి. ” ఇలా చేస్తే చూస్తూ ఊరుకోం.. అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్లో సిమెంటు పరిశ్రమ పునరుద్ధరణ కోసం నిర్వహించిన విద్యార్థి, యువజన పోరు గర్జనకు ముఖ్యఅతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కాసీం, మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు యువతను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆరు వేల మంది యువతకు ఉపాధి కల్పించే ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ జెన్జీ యువతరం తల్చుకుంటే తిరిగి పునఃప్రారంభమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కాసీం పేర్కొన్నారు. యువత పోరాటాల ద్వారా ఏదైన సాధించవచ్చని.. నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థులు, యువకులు ఢిల్లీలో పార్లమెంటు ఎదుట ఆందోళన జరిపితే కేంద్రం దిగొచ్చిందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలిపారు. జార్ఖండ్లో విద్యార్థులు, యువత ఆందోళన చేసి అసెంబ్లీని ముట్టడించారని గుర్తు చేశారు. యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలను మూసివేస్తూ కార్మికులు, యువత ఉపాధిని కొల్లగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2108లో ఆదిలాబాద్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ గెలిపిస్తే సిమెంటు పరిశ్రమను ప్రారంభిస్తామని చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎనిమిదేండ్లు దాటిన ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కోసం రూ.270 కోట్లు ఖర్చు చేశారని, ఏడాది పర్యటనలు మానివేస్తే ఆ డబ్బులతో పరిశ్రమను ప్రారంభివచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల మందికి ఉపాధి కల్పించే సీసీఐ పునురుద్ధరణ విషయంలో నిర్లక్ష్యాన్ని వీడి పరిశ్రమ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
– ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కాసీం
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ ప్రారంభమైతే ఆరు వేల మందికి ఉపాధి లభిస్తుందని, సీసీఐ సాధన కమిటీ చేపట్టే ఆందోళనలకు బీఆర్ఎస్వీ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పరిశ్రమ ప్రారంభానికి యువకులు తెలంగాణ ఉద్యమబాట పట్టాలని సూచించారు. కేంద్ర మంత్రులతోపాటు స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు సీసీఐని ప్రారంభిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులతో కుమ్మకై సిమెంటు పరిశ్రమను పక్కకు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులు ఉన్న సమయంలో పరిశ్రమ మూతపడిందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ వందల పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించారని, దుబాయ్ వంటి దేశాలకు ఉపాధి కోసం వలసలు పోయిన వారు రాష్ర్టానికి వచ్చి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ సభ్యులు యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.
– గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు.
బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు కమీషన్లు వచ్చే పరిశ్రమల కోసం ఆరాటపడుతున్నారే తప్ప ఆరు వేల మంది యువతకు ఉపాధి కల్పించే సీసీఐ పరిశ్రమను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఎయిర్పోర్టు భూ సేకరణ కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్రం, సిమెంటు పరిశ్రమకు రూ.250 కోట్లు ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు సీసీఐని ప్రారంభించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, పరిశ్రమ విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించాలన్నారు.
బీఆర్ఎస్ సీసీఐని ప్రారంభించడానికి పలు ప్రయత్నాలు చేసిందన్నారు. మాజీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి సీసీఐని ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు. అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సీసీఐకి టీఎస్ ఐ పాస్లో భాగంగా రాయితీలు కల్పిస్తామని.. 49,51 నిష్పత్తిలో పరిశ్రమను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని, లేని పక్షంలో సీసీఐని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని సూచించామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు.
– మాజీ మంత్రి జోగు రామన్న