నీలగిరి, ఆగస్టు 12 : ఇంట్లో కొత్త వెలుగులు నిండాయని, ముచ్చటగా ముగ్గురు ఆడబిడ్డల తర్వాత పండంటి మగబిడ్డ జన్మించాడని ఆ కుటుంబం ఎంతో సంబురపడింది. ఆనందం ఆ ఇంట్లో ఎకువ సేపు నిలవలేదు. బిడ్డను ఎంతో మురిపెంగా చూసుకోవాల్సిన తల్లి.. అనారోగ్య సమస్యతో బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు ఆడబిడ్డలు పుట్టిన తరువాత మగబిడ్డ పుట్టిన సంతోషం ఇంటికి చేరకముందే విషాదంగా మారిన సంఘటన బుధవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన గండం మమత(33), రమేశ్ దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు పుట్టిన తరువాత మూడో సంతానం మగబిడ్డ పుడుతుందని ఎదురు చూశారు.
మూడో కాన్పులోనూ ఆడబిడ్డే పుట్టింది. ఈ మూడు కాన్పులు నార్మల్ డెలీవరినే. మగబిడ్డ కావాలని నాలుగో కాన్పు కో సం ఎదురు చేశారు. డెలివరీ కోసం ఈ నెల 3న నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు వచ్చారు. నార్మల్ డెలివరీ కాకపోవడంతో మమతను అన్ని విధాలుగా పరీక్షించిన వైద్యులు చేసేదిలేక ఈ నెల 4న సీజేరియన్ చేయడంతో నాలుగో బిడ్డగా మగసంతానం కలిగింది. బాబు జన్మించడంతో కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు. ప్రసవం తర్వాత మహిళ గొంతు, చాతి నొప్పి, ఆయాసం లాంటి తీవ్ర అనారోగ్యంతో పాటు శారీరక, మానసిక అలసటకు గురైంది. బుధవారం డిస్చార్జి చేస్తామని వైద్యులు చెప్పడంతో మంగళవారం భర్త దవాఖానకు వచ్చాడు.
రాత్రి మళ్లీ నొప్పులు వస్తున్నాయని ఆమె చెప్పడంతో వైద్యులు స్కానింగ్, పరీక్షలు నిర్వహించారు. రాత్రి 1 గంట వరకు ఆమెను కంటికి రెప్పలా వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు చూసుకున్నారు. నొప్పులు తగ్గాయి.. పడుకుంటున్నానని ఆమె తల్లి ఎట్టమ్మకు చెప్పింది. పది నిమిషాల తరువాత లేచి చూస్తే బెడ్పై ఆమె లేకపోవడంతో ఐసీయూలో ఉన్న బాబు దగ్గరకు వెళ్లిందనుకొని అక్కడి వెళ్లారు. అక్కడ ఆమె లేకపోవడంతో దవాఖానలో వేతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. తెల్లవారుజుమున దవాఖాన మార్చురీ గది సమీపంలో ఐరన్ రాడ్కు మమత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. నల్లగొండ టూటౌన్ ఎస్ఐ సైదాబాబు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లి మాదగోని ఎట్టమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పుట్టిన పసిపాపతో పాటు ముగ్గురు ఆడపిల్లలు తల్లిప్రేమకు దూరం కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.