పల్లెలు మంచం పడుతున్నాయి. పట్టణాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రజలను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికితోడు డెంగీ కోరలు చాచడంతో ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. డాక్టర్లు, వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది. అత్యవసరం ఉంటే తప్ప.. సెలవులు ఇవ్వొద్దని ఆదేశించింది. వ్యాధుల నియంత్రణకు సమష్టిగా పనిచేయాలని సూచించింది. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ అలర్ట్ అయ్యింది.
వైరల్ ఫీవర్స్తో నిజామాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో రెండు ఏరియా దవాఖానలు, 22 పీహెచ్సీలు, పది అర్బన్ సెంటర్లు, 8 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటి పరిధిలో నమోదవుతున్న వ్యాధుల వివరాలను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. రోగులను దవాఖానకు తరలించి చికిత్స అందేలా చర్యలు చేపడుతున్నారు. సరిపడా మందులు అందుబాటులోఉన్నాయని డిప్యూటీ డీఎంహెచ్వో, మలేరియా అధికారి తుకారాం రాథోడ్ తెలిపారు.
మలేరియా, టైఫాయిడ్తోపాటు వైరల్ ఫీవర్స్తో ప్రజలు సతమతం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 56 డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రైవేటు దవాఖానలు సైతం రోగులతో కిటకిటలాడుతున్నాయి. అయితే, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నదని వైద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో డెంగీ మరణాలు నమోదు కాలేదని తెలిపారు.
పల్లెలతోపాటు పట్టణాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇటీవలే ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదు. అధికారులు మొక్కుబడిగా వారోత్సవాలు నిర్వహించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎక్కడి చెత్త అక్కడే ఉన్నదని, మురికి కాల్వలు శుభ్రం చేయాలేదని, వీధులన్నీ కంపుకొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జ్వరాలకు ప్రధాన కారణమైన దోమల నివారణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మురికి కాల్వల్లో పూడిక తీయడంతోపాటు ఆయిల్ బాల్స్ వేయడం, రసాయనాల పిచికారీ వంటివి పట్టించుకోవడంలేదు. ఫాగింగ్ మిషన్లను మూలన పడేశారు.
దీంతో దోమలు ఎక్కువయ్యాయి. వైద్యాధికారులు మాత్రం ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. త్వరలోనే జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాలతో అవగాహన కల్పిస్తామని అంటున్నారు.
నిజామాబాద్ నగరంలోని జిల్లా ప్రభుత్వ దవాఖాన రోగులతో కిటకిటలాడుతున్నది. వైరల్ ఫీవర్స్ దాడితో ఓపీ, ఇన్ పేషెంట్ల సంఖ్య మరింత పెరిగింది. ప్రతిరోజూ 1500-1700 ఓపీ నమోదవుతున్నట్లు సిబ్బంది తెలిపారు. ఇన్పేషెంట్లతో బెడ్లు ఫుల్లుగా నిండిపోయాయి. భయపడాల్సిన పనిలేదని, రోగుల తాకిడి, చికిత్సపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ తెలిపారు.
జిల్లాలో ఫీవర్ కేసులు పెరిగాయి. దీంతో ప్రభుత్వ దవాఖానకు రోగులు ఎక్కువగా వస్తున్నారు. అవసరమైన వారికి మందులు ఇస్తున్నాం. అత్యవసరమైతే అడ్మిట్ చేసుకొని నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నాం. రోగులకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిసరాల పరిశుభ్రత పాటిస్తే రోగాలను చాలావరకు నియంత్రించవచ్చు. నిత్యం చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచింది.