ఇందల్వాయి, ఏప్రిల్ 27: అభివృద్ధి వైపు దూసుకుపోవాలన్న ఆ గ్రామస్తుల వాంఛ ప్రగతిపథం వైపు నడిపించేలా చేస్తుంది. ఊరంతా ఏకమై పట్టువదలని విక్రమార్కుడిలా గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో ముందంజలో ఉండాలని ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామస్తులు తపిస్తున్నారు. అందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేయూతనిస్తూ తగిన నిధులు మంజూరు చేస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు రావడమే ఇందుకు నిదర్శనం.
పల్లెప్రగతిలో ఫస్ట్..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి పనుల్లో ముందంజలో ఉంది. గ్రామంలో వైకుంఠధామం, క్రిమిటోరియం, డంపింగ్ యార్డు, నర్సరీ, విలేజ్ పార్క్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేసుకొని మొదటిస్థానంలో నిలిచింది. గ్రామస్తులందరూ ఐక్యతగా ఉంటూ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నారు.
స్వచ్ఛత వైపు అడుగులు..
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 350 కుటుంబాలు నివాసం ఉండగా, ఇప్పటి వరకు 320 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన వాటి పనులు కొనసాగుతున్నాయి. దీంతో సంపూర్ణ మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా పిలువబడుతోంది. గ్రామపంచాయతీ పాలకవర్గంతోపాటు అధికారులు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ వారిలో చైతన్యం తెస్తున్నారు.
తడి, పొడి చెత్తపై కొత్తయాప్..
మల్లాపూర్ గ్రామంలో తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యాప్ ద్వారా ప్రతి ఇంటి యజమాని ఫొటో, పేరు, ఫోన్ నంబర్ వివరాలను సేకరిస్తారు. 25 ఇండ్లకు ఒక క్లస్టర్ ఇన్చార్జిని ఏర్పాటు చేయడంతోపాటు గ్రామంలో 350 ఇండ్లకు 14 మంది క్లస్టర్ ఇన్చార్జీలను నియమించారు. ప్రతి ఇంటి ఎదుట తడి, పొడి చెత్త వేరు చేస్తున్నారా లేదా? అని జియో కార్డు ట్యాప్ ద్వారా తెలుసుకుంటారు. ట్రాక్టర్ తడి, పొడి చెత్త కోసం బయల్దేరినప్పుడు యజమాని సెల్ఫోన్కు మెస్సేజ్ వస్తుంది. అలాగే ట్రాక్టర్ డ్రైవర్, శానిటరీ ఇన్చార్జీ తన వద్ద ఉన్న యాప్లో చెత్తని వేరుపర్చారా లేదా అనే విషయాన్ని మూడు రంగుల బటన్ ద్వారా నమోదు చేస్తారు. తడి, పొడి చెత్త వేరు చేసే సమయంలో యాప్ సిగ్నల్స్ ద్వారా అధికారులు తెలుసుకోవచ్చు.
వలంటీర్లకు బాధ్యత..
గ్రామంలో పలువురు వలంటీర్లకు తడి, పొడి చెత్తపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వలంటీర్లు తమ పరిధిలోని ఇంటికి వెళ్లి చెత్తను విడివిడిగా నిల్వ చేస్తున్నారా? లేదా పరీక్షిస్తున్నారు. చెత్త సేకరించే వాహనంలో వేర్వేరుగా చెత్తను వేస్తున్నారా? లేదా పర్యవేక్షిస్తున్నారు. చెత్త నిల్వపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన వచ్చేవరకు వలంటీర్లు తమ విధులను నిర్వర్తిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా నిలపడమే లక్ష్యం
జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా నిలపడమే మా లక్ష్యం. రూరల్ ఎమ్మెల్యే ప్రోత్సాహంతో మా గ్రామానికి ఉత్తమ అవార్డు రావడం, అభివృద్ధిలో ముందుండడం ఎంతో గర్వంగా ఉంది.
– సత్యనారాయణ, సర్పంచ్
ప్రజలకు సేవ చేయడం అదృష్టం
మా గ్రామాన్ని అభివృద్ధి చేయడంతోపాటు ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడం గర్వంగా ఉంది. గ్రామంలోని ప్రజల సహకారంతో మరిన్ని అవార్డులు పొందేందుకు నా వంతు బాధ్యతగా కృషి చేస్తాను.
– రఘునందన్, ఉపసర్పంచ్