రైతు బంధు, రైతు బీమా
తెలంగాణలోని సాగు భూములపై మరాఠాల దృష్టి
సాగుకు యోగ్యమైన సౌకర్యాలు అందుతుండడమే ప్రధాన కారణం
రైతుబంధు, రైతుబీమా కోసం భూములు కొంటున్న పొరుగు రాష్ట్ర రైతులు
మహారాష్ట్రలో సొంత భూములనూ వదులుకుంటోన్న వైనం
తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో విచిత్ర పరిస్థితి
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో కరెంట్, నీటి సౌకర్యం లేక అక్కడి భూములు పడావుగా మారాయి. అదే పక్కనే ఉన్న తెలంగాణ భూముల్లో సిరులు పండుతున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయానికి నిరంతర కరెంట్తో పాటు సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. మరోవైపు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు మరాఠీ రైతుల మనస్సు గెలిచాయి. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుండడం, రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా అందిస్తుండడం చూసి మహారాష్ట్ర వాసులు తెలంగాణలో భూములు కొంటున్నారు. తమ గ్రామాల్లోని బీడు భూములను అమ్ముకుని మరీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాగుకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో భూములను సాగు చేసుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను పొందుతున్నారు.
నిజామాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో కరెంట్, నీటి సౌకర్యం లేక అక్కడి భూములు పడావుగా మారాయి. అదే పక్కనే ఉన్న తెలంగాణ భూముల్లో సిరులు పండుతున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయానికి నిరంతర కరెంట్తో పాటు సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. మరోవైపు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు మరాఠీ రైతుల మనస్సు గెలిచాయి. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుండడం, రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా అందిస్తుండడం చూసి మహారాష్ట్ర వాసులు తెలంగాణలో భూములు కొంటున్నారు. తమ గ్రామాల్లోని బీడు భూములను అమ్ముకుని మరీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాగుకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో భూములను సాగు చేసుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను పొందుతున్నారు.
పొరుగున ఉన్న మహారాష్ట్రలోని రైతన్నలకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా పథకాలు అందుతున్నాయి. మరాఠీయులకు మన పథకాలు మంజూరవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఆ ప్రాంత వాసులకు తెలంగాణ పథకాలు చేరుతున్నాయి. అదెలా అంటే మన రాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉన్న మహారాష్ట్రవాసులు చాలా మందికి జుక్కల్ నియోజకవర్గంలో వందలాది ఎకరాలు ఉండడమే కారణం. మహారాష్ట్రలో సాగుకు యోగ్యమైన భూములు లేకపోవడం, భూములున్నప్పటికీ సాగుకు సౌకర్యాలు కరువవ్వడంతో వాటన్నింటినీ వదులుకొని తెలంగాణకు వచ్చి సాగు భూములను కొనుగోలు చేస్తున్నారు. తద్వారా తెలంగాణ రైతులకు అందుతున్న పథకాలు వాళ్లకు కూడా చేరుతున్నాయి. ఠంఛన్గా మహారాష్ట్రలోని బ్యాంక్ అకౌంట్లో నిర్ణీత మొత్తాలు జమ అవుతున్నాయి. తారతమ్య భేదం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా స్కీములు పక్కనే ఉన్న సరిహద్దు ప్రాంత ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇంటర్ స్టేట్ బార్డర్లో “నమస్తే తెలంగాణ” పరిశీలనకు వెళ్లి మరాఠా రైతులతో మాట్లాడగా వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అటోళ్లు ఇటు…
ఇలా ఒకరు కాదు… ఇద్దరు కాదు… పదులు, వందల సంఖ్యలో మరాఠా రైతుల చూపంతా తెలంగాణపై పడుతున్నది. తమ సొంత రాష్ట్రంలో సాగు భూములున్నప్పటికీ పంటలు పండించడానికి యోగ్యత లేకపోవడంతో చాలా మంది మన ప్రాంతాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఏడాది పొడవునా సాగు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా సాగు నీరు, ఉచిత కరెంట్, ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి సాయం, రైతుకు బీమా సౌకర్యం, పంట కొనుగోళ్లలోనూ కనిపించని ఇక్కట్లు వెరసి.. పొరుగు రాష్ర్టానికి చెందిన రైతుల చూపు కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపైనే పడింది. మొన్నటి వరకు తెలంగాణలో తమ ప్రాంతాన్ని విలీనం చేయాలంటూ డిమాండ్ చేసిన వారే… ఇప్పుడు సాంకేతికంగా మన పథకాలకు అర్హులుగా మారి ప్రయోజనాలను అందిపుచ్చుకుంటుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వందలాది మంది ఈ తరహాలో భూములను కొనుగోలు చేసి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను పొందుతున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గడిచిన ఏడేండ్లలో సుమారుగా 250 ఎకరాలకు పైగానే మరాఠీయుల పేరిట వ్యవసాయ భూములు బదిలీ జరిగాయి. సలాబత్పూర్, చిన్న శక్కర్గ, మద్నూర్ వంటి సరిహద్దు గ్రామాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ చాలా మంది భూములు కొంటున్నారు. వీళ్లంతా దెగ్లూర్ తాలూకా పరిధిలోని మరికేల్, ఖరడ్కేల్, ఖానాపూర్, నెరంగల్, భక్తాపూర్, కొట్టుల్ వంటి గ్రామాలకు చెందినవారే.
హన్మంతు అర్గుల్వార్ మహారాష్ట్రలోని దెగ్లూర్ వాసి. తెలంగాణలోని మద్నూర్ మండలం సలాబత్పూర్ గ్రామ పరిధిలో రెండు ఎకరాల సాగు భూమి ఉంది. ఇతనికి ఏటా రైతుబంధు రూపంలో రూ.20వేలు బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. రైతుబీమా పథకానికి అర్హుడిగా మారాడు. భూమితో పాటు సరిహద్దులో చిన్న హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. తనభూమిలో ఏటా సోయా, కుసుమ, పత్తి వంటి పంటలు పండిస్తుండగా, పక్కనే ఉన్న మహారాష్ట్ర భూములు పడావుగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో రైతు పథకాలు ప్రోత్సాహకంగా ఉండడంతో పంటల సాగు చేయడం సులువైందని హన్మంతు చెబుతున్నాడు.
ఇక్కడే ఇల్లు కట్టుకుంటా…
మద్నూర్ మండలం చిన్న శక్కర్ల గ్రామంలో 2.20 ఎకరాల భూమి కొన్నా. తెలంగాణ ప్రభుత్వం నా పేరు మీద పాస్పుస్తకం కూడా మం జూరు చేసింది. సోయా, పత్తి, కుసుమ పంటలు సాగు చేస్తున్న. పంట ఉత్పత్తులను ఇక్కడి ప్రభుత్వం బాధ్యతగా కొంటున్నది. మహారాష్ట్రలో వ్యాపారులను నమ్ముకొని మోసపోవుడే. ఇక్కడ సౌలత్లు బాగున్నాయి. త్వరలో ఇక్కడే ఇల్లు కట్టుకుంటా..
– యశ్వంత్ కాబ్దే, మరాఠా యువ రైతు
ఈ ఫొటోలో జీవాలను మేపుతున్న వ్యక్తి పేరు నగేశ్ ముక్కల్వార్. ఇతను మహారాష్ట్ర వాసి. దెగ్లూర్ సమీపంలోని మరికేల్ గ్రామానికి చెందిన యువకుడు. ఇతనికి సొంత గ్రామంలో మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సాగుకు నీళ్లు లేవు. కరెంట్ ఉండదు. ఎరువులు, విత్తనాలు అందవు. జీవనాధారంగా తనకున్న 120 గొర్రెలను మేపుకొంటూ బతుకుతున్నాడు. తన ప్రాంతాన్ని నమ్ముకుంటే తనకు, జీవాలకు పొట్ట నిండదు. నిత్యం మూడు కిలోమీటర్ల మేర జీవాలతో కలిసి కాలినడకన తెలంగాణ సరిహద్దు పల్లెలకు రావాల్సిందే. లేదంటే తనతోపాటు వందలాది మూగ జీవాలకు ఆహారం లేదు. మహారాష్ట్రలోని పొలాల్లో గ్రాసం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జీవాలను బతికించుకోవాలంటే నిత్యం మహారాష్ట్ర నుంచి తెలంగాణకు చేరుకోవాల్సిందే.
తెలంగాణ లేకుంటే గొర్రెలు బతికేవే కాదు…
మా సైడు వ్యవసాయ భూములన్నీ పడావుగా ఉండడంతో జీవాలకు ఆహారం కూడా దొరకదు. ఎండాకాలం వచ్చిందంటే తాగేందుకు నీళ్లుండవు. అందుకే పొద్దున్నే లేచి తెలంగాణ వైపు వస్తాం. నాకు వందకు పైగా గొర్రెలున్నాయి. మేపిన తర్వాత సాయంత్రం తిరిగి ఇంటికెళ్తాను. తెలంగాణ లేకుంటే ఈ గొర్రెలన్నీ బతికేవే కావు.
– నగేశ్ ముక్కల్వార్, మహారాష్ట్ర యువకుడు
వ్యవ‘సాయం’ కోసం…
మహారాష్ట్రవాసులు తెలంగాణపై దృష్టి పెట్టడానికి ముఖ్య కారణం వ్యవసాయానికి అందుతున్న ప్రోత్సాహమే. దేశమే ఆశ్చర్యపోయేలా రైతుకు పెట్టుబడి సాయం అందివ్వడం, బీమా సౌకర్యం కల్పించడం, సాగు నీరు, ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాల మూలం గా మరాఠా రైతులు ఈ వైపునకు పరుగులు తీస్తున్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో జుక్కల్ నియోజకవర్గం ఒక మూలకు విసిరేసినట్లుగా ఉండేది. నాటి పాలకుల చిన్నచూపుతో ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడదూరం లో కొట్టుమిట్టాడేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జుక్కల్ ఇప్పుడు అభివృద్ధిలో జిగేల్మంటున్నది. మొన్నటి వరకు ఈప్రాంతాన్ని చిన్నచూపు చూసిన పక్క రాష్ట్రం వారే ఇప్పుడు గొప్పగా అభివర్ణిస్తున్నారు. అద్భుత పథకాలను వేనోళ్లతో కొనియాడుతున్నారు. కేసీఆర్ పథకాలకు అర్హత సాధించేందుకు రూ.లక్షలు పెట్టి భూ ములు కొనుగోలు చేస్తున్నారు. 2014 వరకు మద్నూర్(తెలంగాణ) – దెగ్లూర్(మహారాష్ట్ర) సరిహద్దులో భూములను ఎవరూ పట్టించుకునేవారే కాదు. రూ.5 లక్షలకు ఎకరం కూడా కొనేవారు కాదు. ఇప్పుడు ఎకరం సాగు భూమి రూ.20లక్షల వరకు చేరింది. రోజురోజుకూ డిమాండ్ భారీగా పెరుగుతున్నది.
నా పొలం గెట్టు దాటితే తెలంగాణ…
నాది 2.02 ఎకరాల పొలం. సరిగ్గా తెలంగాణ – మహారాష్ట్ర బార్డర్లో సలాబత్పూర్ – దెగ్లూర్ శివారులో ఉన్నది. గెట్టు దాటితే తెలంగాణలోకి వస్తది. ఇటు ఇవతల మహారాష్ట్రలో నా భూమి నమోదై ఉంది. నా పక్క పొలం వాళ్లకు రైతుబంధు, రైతుబీమా, కరెంట్, ఎరువులు, విత్తనాలు అన్నీ వస్తున్నాయి. నాకు రావడం లేదు. చాలా బాధగా ఉన్నది.. తెలంగాణలో నా భూమి నమోదై ఉంటే మంచిగుండు అనిపిస్తుంది.
– ఈరన్న కుదుల్వార్, మరాఠా రైతు
పొద్దున తెలంగాణకు… రాత్రి మహారాష్ట్రకు…
సలాబత్పూర్ చెక్పోస్టును ఆనుకొని నాకు మూడెకరాల భూమి ఉన్నది. సోయా సాగు చేస్తున్న. పొద్దున పొలం పనుల కోసం తెలంగాణకు వస్తాం. ఇక్కడ పంటలు చూసుకుని రాత్రికి మహారాష్ట్రకు పోతాం. మాకు ఇక్కడే మంచిగున్నది. వ్యవసాయానికి అన్ని రకాల సాయం అందుతున్నది. కేసీఆర్ సార్ గ్రేట్.
– నాగ్శెట్టివార్ రాఘవేంద్ర, మరాఠా రైతు