జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరుతున్నది. మాధవనగర్ ఆర్వోబీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ విషయంలో కేంద్రం తాత్సారం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రూ.63.12 కోట్లు కేటాయించడంతో పనులు ఊపందుకున్నాయి. మొత్తం 42 పిల్లర్లు వేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తవ్వగానే వాటిపై స్లాబ్ వేసే పనులు చేపట్టనున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. వంతెన సరిహద్దులు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కాగా బ్రడ్జి నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నది.
-నిజామాబాద్ రూరల్, ఆగస్టు 13
నిజామాబాద్ రూరల్, ఆగస్టు 13 : ఇందూరు జిల్లావాసులు ఎన్నో దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న మాధవనగర్ వద్ద ఉన్న రైల్వేట్రాక్పై ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి అవసరమైన రూ.63.12 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఫలితంగా నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వేసవికాలంలోనూ కురిసిన అకాల వర్షాలతో పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో కొన్ని రోజుల పాటు నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. రైల్వే ట్రాక్పై ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు వేసిన అంచనాల ప్రకారం వంతెన నిర్మాణం కోసం మొత్తం 42 పిల్లర్లు వేసే పనులు జరుగుతున్నాయి. పిల్లర్ల నిర్మాణ పనులు పూర్తవ్వగానే త్వరలోనే వాటిపై స్లాబ్ వేసే పనులు చేపట్టనున్నట్లు ఆర్అండ్బీ డీఈ ప్రవీణ్ తెలిపారు. వంతెన సరిహద్దులు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. పనులను ఆర్అండ్బీ ఎస్ఈ వసంత్నాయక్, ఈఈ సురేశ్, డీఈ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు.
ఇందూరు జిల్లావాసుల దశాబ్దాల కల ఇక త్వరలో నెరవేరనున్నది. ఇందూరు నగర శివారులో మాధవనగర్ రైల్వే ట్రాక్పై ఆర్వోబీ లేకపోవడంతో రైళ్ల రాకపోకల సమయాల్లో ఆ రోడ్డు గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఐదారేండ్ల నుంచి సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు రైళ్ల రాకపోకల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మాధవనగర్ రోడ్డు గుండా వెళుతున్న ప్రయాణికులు మరింత అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కలిసి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితల దృష్టికి ఆర్వోబీ నిర్మాణం అవశ్యకత గురించి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రూ.63.12 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో ప్రజాప్రతినిధుల సమష్టి కృషి ఫలితంగా నిధులు మంజూరు కావడంతో ఆర్వోబీ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.
ఉమ్మడి పాలనలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రా పాలకులు మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గురించి ఊసే ఎత్తని దుస్థితి ఉండేది. నాడు కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నేతలు పాలకులుగా ఉన్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు. దీంతో దశాబ్దాలుగా ఇందూరు జిల్లావాసుల ఆర్వోబీ నిర్మాణం కలగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొన్నది. నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఎన్నోసార్లు ఆర్వోబీ నిర్మాణ విషయమై అప్పటి మంత్రులు, సీఎంలకు విన్నవించినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంది.
ఆర్వోబీ నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు అంచనాల మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ నిధుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది. అప్పట్లో జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత ఆర్వోబీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించగా చివరికి చాలీచాలనీ నిధులు కేవలం రూ.30కోట్లు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, జిల్లాశాసనసభ్యులతో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్వోబీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరులో అనుసరిస్తున్న దాటవేత ధోరణి గురించి సీఎంకు వారు వివరించారు. సీఎం తక్షణమే స్పందించి ఆర్వోబీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద సరిపడేలా రూ.63.12 కోట్లు మంజూరు చేశారు. ఫలితంగా పనులు ప్రస్తుతం చురుగ్గా జరుగుతున్నాయి.
మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే.. ఎంపీగా ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని ఎన్నోసార్లు కోరారు. అయినా కేంద్రం కేవలం రూ.30 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చింది. ఈ తరుణంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు ఎమ్మెల్యేలందరూ కలిసి సీఎం కేసీఆర్కు పరిస్థితి వివరించగా రూ.63.12 కోట్లు నిధులు వెంటనే మంజూరు ఇచ్చారు. దీంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. వాస్తవం ఇలా ఉంటే ఎంపీ అర్వింద్ కేంద్రం నుంచి సరిపడా నిధులు తెచ్చే దమ్ములేక ఆర్వోబీ పనులను తామే చేపడుతున్నట్లు గొప్పలు చెప్పుకోవడానికే సరిపోతున్నాడు. ఎంపీగా గెలిచిన ఆయన జిల్లా అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా నాలుగున్నరేండ్లుగా కాలయాపన చేస్తూ వస్తుండు.
-బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే