బాన్సువాడ రూరల్/ నిజాంసాగర్, మార్చి 26: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి జహీరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ, జుక్కల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండేతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడారు. బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఎంపీ బీబీ పాటిల్ పదేండ్లుగా చేసిందేమీ లేదని, ఐదేండ్లుగా ఎంపీగా పనిచేసిన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ చేసింది శూన్యమని దుయ్యబట్టారు. ఇద్దరూ ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించిన ఎంపీ బీబీ పాటిల్ తన స్వార్థం కోసం కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశాడని అన్నారు. అధికారం కోసం బీజేపీలో చేరిన బేమాన్ బీబీ పాటిల్ అని, ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాడని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ రాజకీయాలకు కొత్త అని, ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన ఆయనకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పార్టీ టికెట్ ఇచ్చాడని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అనిల్కుమార్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థికి 50వేల మెజార్టీ రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. తన 40ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో వెంట ఉండి పదవులు అనుభవించిన వారు స్వార్థ రాజకీయాల కోసం పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని, ప్రస్తుతం కడిగిన ఆణిముత్యాల్లాంటి నాయకులు, కార్యకర్తలు తన వెంట ఉన్నారని ఎమ్మెల్యే పోచారం అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు కొన్ని పనికిమాలిన యూట్యూబ్ చానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మారే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టి చెప్పారు. కేసీఆర్ హయాంలో బాన్సువాడ నియోజకవర్గాన్ని అద్దంలా తయారు చేశానని అన్నారు. పదవులు అనుభవించి పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే తాను ఉంటానని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే పోచారం విమర్శించారు. వారిచ్చిన హామీలు 420హామీలని అభివర్ణించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా, గాలి అనిల్ కుమార్ ఎంపీగా ఈ ప్రాంత అభివృద్ధికి కోసం పనిచేస్తామని తెలిపారు. బ్రాడ్గేజ్ రైల్వేలైన్ను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించడం సంతోషంగా ఉందని గాలి అనిల్ కుమార్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో జహీరాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, ప్రజలు కారుగుర్తు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. బాన్సువాడకు రైల్వేలైన్ తీసుకొచ్చే బాధ్యత తనదేనని అన్నారు. జహీరాబాద్కు వచ్చిన నిమ్జ్ లో స్థానికులకే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి కోట్ల మంది కార్యకర్తలే బలం, బలగమని డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. ప్రజల్లో పలుకుబడి లేని కొందరు నాయకులు పార్టీ మారితే వచ్చే నష్టం ఏమీలేదని అన్నారు. బాన్సువాడ అంటేనే పోచారం అడ్డా అని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు మోహన్ నాయక్, రాజేశ్వర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, నేతలు దుద్దాల అంజిరెడ్డి, బద్యానాయక్, జంగం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్, మార్చి 26: తాను అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయానని, తన ఓటమికి ప్రధాన కారణం బీబీ పాటిల్, ఆయన కుటుంబసభ్యులే అంటూ మాజీ ఎమ్మెల్యే హన్మంత్షిండే రోదించాడు. పోచారం, తాను కలిసి కేసీఆర్ను ఒప్పించి బీబీపాటిల్కు ఎంపీ టికెట్ ఇప్పిస్తే … అధికారం కోసం కేసీఆర్కు వెన్నుపోటు పొడిచాడని అన్నా రు. రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గాలి అనిల్కుమార్ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని షిండే స్పష్టం చేశారు.