దశాబ్దాల కల నెరవేరిన వేళ.. గిరిజన రైతుల్లో ‘పట్టా’నంత సంతోషం కనిపిస్తున్నది. పోడు భూములపై చట్టబద్ధ హక్కులు లభించడంతో అంతులేని ఆనందం వ్యక్తమవుతున్నది. గిరిపుత్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వం పోడు పట్టాల పంపిణీని శుక్రవారం ప్రారంభించింది. బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, లింగంపేట్ మండలం మాలోత్ సంగ్యానాయక్ తండా, పెద్ద కొడప్గల్లో ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే రైతులకు పట్టాలు అందజేశారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పట్టాలు చేతికందడంతో గిరిజనులు పరవశించి పోయారు. తాము కూడా భూ యజమానులం అయ్యామని, తమకూ రైతుబంధు, రైతుబీమా వర్తిస్తుందని సంబురపడుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
– నిజామాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) /కామారెడ్డి, (నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
పోడు భూముల్లో పంటలు చేతికందే సమయంలో అటవీ శాఖ అధికారులు దున్ని నాశనం చేసేవారు. పోడు భూములకు హక్కు పత్రాలు అందించడంతో ధైర్యంగా పంటలు సాగు చేసుకుంటాం. పట్టాలు అందించిన కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
-కేతావత్ అన్సీ, మాలోత్ సంగ్యానాయక్ తండా, లింగంపేట్ మండలం
నిజామాబాద్, జూన్ 30, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దశాబ్దాలుగా పోడు పట్టాల కోసం ఎదురు చూస్తున్న గిరిజనుల ఆశలు ఎట్టకేలకు నెరవేరాయి. శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో పోడు పట్టాలు జారీ అయ్యాయి. శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టారు. అటవీ శాఖకు చెందిన భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని సంబంధిత అధికారులు, రైతుల మధ్య గొడవలెన్నో జరిగాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లోని మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉండేది. సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికే పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్లే గిరిజనులకు దశాబ్దాలుగా వేధిస్తున్న పోడు సమస్యకు చట్టబద్ధమైన హక్కు పత్రా లు చేతికి అందడంతో సంతోషం వెల్లివిరిసింది.
చట్టం ఏం చెబుతున్నది ?
అటవీ నివాసితుల చట్టం 2006 పార్లమెంట్లో ఆమోదమైంది. 2007, డిసెంబర్ 31 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా తరతరాల నుంచి అడవిపై ఆధారపడి జీవనాధారం పొందుతున్న గిరిజన తెగలకు హక్కులు కల్పించబడ్డాయి. ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ నాటికి అటవీ భూమిలో నివాసం ఉండి సాగు చేస్తూ ఆ భూమిపై జీవనాధారం సాగించే గిరిజనులు మాత్రమే అర్హులు. ఈ చట్టంలోని సెక్షన్ 4(6) ప్రకారం 4 హెక్టార్లు, 10 ఎకరాలకు మించకుండా భూమి ఉండాలి. గిరిజనేతరులైతే 2005 కన్నా ముందు 3 తరాల వారు అంటే 75ఏండ్లకు పూర్వం అటవీ భూముల్లో నివాసం ఉండి సాగు చేస్తూ వాటిపై మాత్రమే జీవనాధారం కలిగి ఉండాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒకే సారి పట్టాలు అందించారు. తద్వారా గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందని ద్రాక్షే అన్నట్లుగా మిగిలింది. సీఎం కేసీఆర్ భూములను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజనుల చిరకాల వాంఛను నెరవేర్చారు. ఇది దేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా గిరిజన ప్రజలు కొనియాడుతున్నారు.
పకడ్బందీగా అర్హుల గుర్తింపు…
కబ్జాదారుల నుంచి 2022, నవంబర్లో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఆయా మండలాల నుంచి వేలాది దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం 2006 అటవీ హక్కు ల చట్టం ప్రకారం జీపీఎస్, వివిధ సర్వేల ఆధారంగా అర్హులను గుర్తించింది. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలో 4229 మంది రైతులకు 8611 ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు మం జూరయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 5020 మంది రైతులకు 11వేల ఎకరాల భూములకు చట్టబద్ధమైన హక్కులను ప్రభుత్వం కట్టబెట్టింది. పట్టాలు పొందిన అన్నదాతలకు సైతం రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనున్నాయి. చివరి విడుతలో వీరికి రైతుబంధు సాయం అందించబోతున్నారు. లబ్ధిదారులు రైతుబీమాకు అర్హత పొందనున్నారు.
అడవుల సంరక్షణ కనీస బాధ్యత…
పోడు భూములకు పట్టాలు ఇవ్వడం సాధారణమైన విషయం కాదు. వృక్ష సంపదకు నష్టం కలుగుతుందన్న భయాలను తక్కువగా అంచనా వేయకూడనిది. అందుకే ప్రత్యామ్నాయంగా వృక్ష సంపద వృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అదే హరితహారం పథకం రూపంలో రోడ్డు పక్కన, ఖాళీ స్థలాలు, ఎక్కడ వీలుంటే అక్కడ మొక్కల పెంపకాన్ని ఉద్యమం మాదిరిగా చేపట్టింది. మానవీయ కోణంలో ఆశించి పోడు భూ ములకు శాశ్వతంగా పరిష్కారం చూపడం ద్వారా కేసీఆర్ ముఖ్యమంత్రిగా గొప్ప చరిత్ర లిఖించారు. భవిష్యత్తులో అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా రక్షించుకునే బాధ్యతను కూడా గిరిజనులకే అప్పగించారు. భవిష్యత్తులో అటవీ భూములు మరోసారి ఆక్రమణకు గురి కాకుండా పక్కాగా హద్దులు గుర్తించారు. వివాదరహిత భూములు దున్నుకుని ఇకనైన గిరిజనులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఇన్నాళ్లకు లభించింది.
గిరిపుత్రుల ఆనందం..
కామారెడ్డి, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : దశాబ్దాల సమస్యను పరిష్కరిస్తూ సీఎం కేసీఆర్ గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తుండడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లువిరిస్తున్నది. లబ్ధిదారులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంబురాలు జరుపుకున్నారు. జిల్లాలోని బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో శుక్రవారం పట్టాలను అందజేశారు. బాన్సువాడ నియోజకవర్గంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోకవర్గంలోని 9 మండలాల్లో గల 2100 లబ్ధిదారులకు సుమారు 4వేల ఎకరాల పోడు భూములకు సంబంధించిన పట్టాలను అందజేశారు.
జుక్కల్ నియోజకవర్గంలో..
జుక్కల్ నియోజకవర్గంలోని పెద్దకొడప్గల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే మొత్తం 186 మంది లబ్ధిదారులకు 649 ఎకరాల పోడు భూమికి సంబంధించిన పట్టాలను అందజేశారు. విఠల్వాడి, విఠల్వాడి తండా, కాసులాబాద్, బేగంపూర్ తండాలకు చెందిన గిరిజనులు పట్టాలను అందుకున్న వారిలో ఉన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..
ఎల్లారెడ్డి నియోకవర్గంలోని లింగంపేట మండ లం మాలోత్ సంగ్యానాయక్ తండా గ్రామ పంచాయతీలో 129 మంది లబ్ధిదారులకు 170 ఎకరాల పోడు భూమి పట్టాలను ఎమ్మెల్యే జాజాల సురేందర్ అందజేశారు. ఎల్లారెడ్డి నియోకవర్గంలో మొత్తం 2983 మంది లబ్ధిదారులకు 6531 ఎకరాలు పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.