ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్లీ విధుల్లో చేరారు. రెండున్నరేండ్ల తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేసే క్షేత్ర సహాయకులు.. 2020 ప్రారంభంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. దీంతో సర్కారు వారిని బాధ్యతల నుంచి తొలగించింది. సుమారు రెండున్నరేండ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఖాళీగా ఉంటున్నారు. అయితే, మానవీయ కోణంలో స్పందించిన సీఎం కేసీఆర్.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 630 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఊరట లభించింది. సర్కారు ఆదేశాలతో వెంటనే బాధ్యతలు స్వీకరించారు. తమకు మళ్లీ ఉపాధి కల్పించిన సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. నిబద్ధతతో పనిచేసి రాష్ర్టానికి మంచిపేరు తీసుకొస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 11, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరారు. సుదీర్ఘ కాలం తర్వాత పనులు చేపట్టడంతో వారందరిలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఉపాధి కరువై కొన్ని నెలల పాటు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడిన వారంతా ఊరట పొందుతున్నారు. 2020 ప్రారంభంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కొన్ని శక్తులు ఆడిన కుట్రలో వీరు అమాయకంగా ఇరుక్కుపోయారు. రాజకీయ పార్టీలు సైతం వీరిని కొద్ది రోజుల పాటు తమ స్వార్థానికి వాడుకున్నాయి. ఆ తర్వాత చేతులెత్తేయడంతో అగమ్యగోచరంగా రోడ్డున పడాల్సి వచ్చింది. వేలాది మంది వారంతట వారే రోడ్డున పడి దిక్కుతోచని స్థితిలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ తిరిగి వారందరినీ విధుల్లోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగమై రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వస్తామంటూ ప్రస్తుతం వారంతా శపథం పూనుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 630 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.
కార్యక్షేత్రంలోకి ఫీల్డ్ అసిస్టెంట్లు..
నిజామాబాద్ జిల్లాలో 29 మండలాల్లో 27 మండలాల పరిధిలోని 530 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలవుతోంది. ఇందులో మొత్తం 2లక్షల 77వేల 165 జాబ్ కార్డులున్నాయి. 5లక్షల 62వేల 659 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 334 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహించే వారు. వీరంతా ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన అవకాశంతో తిరిగి విధుల్లో చేరారు. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో 526 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కొనసాగుతోంది. 2లక్షల 76వేల 162 జాబ్ కార్డులున్నాయి. ఇందులో 5లక్షల 56 వేల 783 మంది కూలీలుగా నమోదై ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 296 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహించారు. వీరంతా తిరిగి పనుల్లో చేరారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ బుధవారమే ఆయా జిల్లా కలెక్టరేట్లలోని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కార్యాలయంలో తిరిగి విధులు చేపట్టారు. వీరందరికీ గతంలో పని చేసిన చోటనే విధులను సర్దుబాటు చేశారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం అమలవుతున్న పనులు, నిధుల ఖర్చు, జాబ్ కార్డులు, కూలీల వివరాలతో కార్యక్షేత్రంలో విధులు నిర్వహించేందుకు క్షేత్ర సహాయకులు నిమగ్నం అవుతున్నారు.
లోటు లేకుండా సర్కారు చర్యలు..
వాస్తవానికి ఉపాధి హామీ పథకం ప్రారంభ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతున్నారు. 2007లో ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. అప్పట్లో వారికి అరకొర జీతాలే అందేవి. కేంద్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించకపోయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ బాధ్యతగా తీసుకుని వీరికి మరిన్ని సదుపాయాలు కల్పించారు. జాబ్ కార్డులు ఉన్న వాళ్లలో సాధ్యమైనంత ఎక్కువ మందిని ఉపాధికి వచ్చే విధంగా చూడాలని, విధుల్లో తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమను పర్మినెంట్ చేయాలని, జీతాలు ట్రెజరీ శాఖ ద్వారా ఇవ్వాలని డిమాండ్లతో సమ్మెకు వెళ్లారు. కరోనా లాక్డౌన్ విధించిన 2020, మార్చి 18 నుంచి వారు పనుల్లోకి రాలేదు. 28 నెలలుగా వారు విధుల్లో లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించింది. ఎక్కడా పథకాన్ని నిలుపుదల చేయలేదు. అంతేకాకుండా గతం కంటే మిన్నగా పనులను చేపట్టారు. అత్యధిక మందికి కూలీ అప్పగించారు. ఇందుకోసం పంచాయతీ సెక్రటరీల సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరడంతో పంచాయతీ కార్యదర్శులకు పని భారం తగ్గనుంది.
సీఎం మానవీయ నిర్ణయం..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శక్తులు ప్రమాదకరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తమ స్వార్థం కోసం ఎంతటికైనా దిగజారే దుస్థితికి దిగజారుతోంది. ఇందుకు ఫీల్డ్ అసిస్టెంట్ల అంశమే నిదర్శనం. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే భారీ కుట్రతో 2020లో వీరితో ఆందోళనలు చేయించారు. అమాయకులను రోడ్డు మీదికి తీసుకు వచ్చి తమ పబ్బం గడుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదట్నుంచి వీరందరికీ అండగా నిలిచినప్పటికీ కావాలనే రాజకీయ కుట్రలో వీరంతా పావులై ఇరుక్కుపోయారు. ఒక రోజుతో మొదైలన ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యమం కాస్తా రోజులు, నెలలుగా కొనసాగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెర్ర చేయాల్సి వచ్చింది. విధులకు దూరమైన వారందరికీ గడువు ఇచ్చి తిరిగి బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. నిర్ధిష్ట సమయానికి ఎవరూ విధుల్లో చేరకపోవడంతో వాళ్లంతట వాళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇవే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మచ్చుకూ వీరిని పట్టించుకోలేదు. పైగా సీఎం కేసీఆరే వీరి దీనావస్థలను గ్రహించి మానవతా దృక్పథంతో తిరిగి అవకాశం కల్పించడంతో వారి జీవితాల్లో వెలుగులు దక్కే పరిస్థితి ఏర్పడింది. వరి సాగు విషయంలోనూ బీజేపీ ఇదే కుట్రలను అవలంభించి రైతులను మోసగించిన సంగతి అందరికీ తెలిసిందే. వరి సాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే… వరి వేయాలంటూ ఎంపీ అర్వింద్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టి కర్షకుల గోసకు గతంలో కారకులయ్యారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ పెద్దమనసుతో మా సమస్యలను అర్థం చేసుకుని విధుల్లోకి తీసుకోవడం హర్షణీయం. అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు మేం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. మా సమస్యలను పరిష్కరించి విధుల్లోకి తీసుకుంటున్నందున సీఎం కేసీఆర్కు ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విజయవంతంగా విధులు నిర్వహిస్తాం. పనుల్లో జాప్యం లేకుండా, కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా విధులు నిర్వహిస్తాం.
-ఎం.గోపిచంద్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, గోవింద్పల్లి (ధర్పల్లి)
తిరిగి తీసుకుంటారనుకోలేదు
మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటారనుకోలేదు. సీఎం కేసీఆర్ పెద్దమనసుతో మా ఇబ్బందులను అర్థం చేసుకుని మాపై కనికరం చూపారు. పంతాలకు పోకుండా పనులు చేసుకుంటాం. పెద్దమనసుతో అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. పీల్డ్ అసిస్టెంట్ల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
కె.మహేందర్, ఫీల్డ్ అసిస్టెంట్, మైలారం (ధర్పల్లి)
మా కష్టాలను కేసీఆర్ గుర్తించారు
సీఎం కేసీఆర్ సారు మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసుకోవడం సంతోషంగా ఉంది. మేం ఉపాధిహామీ విధుల్లో లేనప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మా కష్టాలను సీఎం కేసీఆర్ సారు గుర్తించారు. మేము ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– పోశెట్టి, ఫీల్డ్ అసిస్టెంట్, కొడిచెర్ల(కోటగిరి)
సీఎం కేసీఆర్ మాపై దయ చూపారు
ఉపాధి హామీ పథకంలో మళ్లీ తీసుకోవడం సంతోషంగా ఉంది. 25 నెలలు విధులకు దూరంగా ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం. కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చింది. మేము పడుతున్న ఇబ్బందులను చూసి సీఎం కేసీఆర్ మాపై దయ చూపారు. సీఎం సారుకు చాలా కృతజ్ఞతలు.
– రావుల వెంకటలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్, కోటగిరి