నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 3 : విద్యారంగానికి గత కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పేద బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో విద్యాబోధన అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఉండేందుకు పుష్కలంగా నిధులు మంజూరుచేసి సకల వసతులతో కూడిన భవనాలు నిర్మించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంజూరు చేసింది. మోపాల్ గ్రామంలో మూడేండ్ల నుంచి తరగతులు అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. నెలకు రూ.22వేలు అద్దె చెల్లిస్తున్న ఈ భవనంలో 5 నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంతో 186 మంది విద్యార్థినులు చదువుతున్నారు.
అద్దె భవనంలో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఇరుకైన గదుల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాలయ భవన నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవ చూపి రూ.3.72 కోట్ల నిధులు మంజూరు చేయించారు. భవన నిర్మాణం కోసం నిజామాబాద్ మండలంలోని ఆకుల కొండూర్ గ్రామపంచాయతీ పరిధి అశోక్ఫారం గ్రామ ప్రధాన రోడ్డు పక్కన రెండు ఎకరాల 20 గుంటల భూమిని తాజా మాజీ సర్పంచ్ అశోక్ సహకారంతో అధికారులు కేటాయించారు. ఈ స్థలంలో రూ.3.72 కోట్ల నిధులతో‘మన ఊరు – మన బడి’ డీఈ అంజిరెడ్డి పర్యవేక్షణలో భవన నిర్మాణ పనులు పూర్తిచేశారు.
విశాలమైన స్థలంలో నిర్మించిన ఈ భవనంలో విద్యార్థినుల కోసం అనేక సౌకర్యాలు కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్లో తరగతి గదులు, ప్రిన్సిపాల్ కార్యాలయం, వంటశాల, భోజనశాల నిర్మించారు. మొదటి, రెండో అంతస్తుల్లో డార్మెటరీ గదులను ఏర్పాటు చేశారు.
ఏడాదిన్నర క్రితం తాజా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చొరవతో కస్తూర్బా గాంధీ విద్యాలయ భవన నిర్మాణానికి రూ.3.72 కోట్లు మంజూరయ్యాయి. విద్యార్థినులు ప్రశాంత వాతావరణంలో చదువుకోవాలంటే విశాలమైన తరగతి గదులు, డార్మెటరీలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మించారు. పేద విద్యార్థుల పక్షపాతి అయిన బాజిరెడ్డి గోవర్ధన్కు మేమంతా రుణపడి ఉంటాం. ఆయనకు కృతజ్ఞతలు.
డీఈవో దుర్గాప్రసాద్ ఆదేశాలతో అద్దె భవనంలో కొనసాగుతున్న కేజీబీవీని అశోక్ఫారంలో కొత్తగా నిర్మించిన భవనంలోకి బుధవారం షిఫ్ట్ చేశాం. విద్యార్థినులకు అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండేలా నిర్మించారు. ఎలాంటి అసౌకర్యాలూ కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.