కమ్మర్పల్లి/భీమ్గల్/మోర్తాడ్/ బాల్కొండ/ మెండోరా/వేల్పూర్/ఏర్గట్ల, అక్టోబర్ 31: వేల్పూర్ మండలంలోని స్సైస్ పార్కులో ఈ నెల 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం మండల కేంద్రాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందన్నారు. మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిగా, మంత్రి ప్రశాంత్రెడ్డిని మరోసారి గెలిపించేందుకు ప్రజలు ఉత్సాహంతో ఉన్నారన్నారు.
తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించబోతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రతి గ్రామం నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతులు, యువకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. వేర్వేరుగా మండల కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో కమ్మర్పల్లి , భీమ్గల్, మోర్తాడ్, బాల్కొండ, మెండోరా, ఏర్గట్ల బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, దోనకంటి నర్సయ్య, బద్దం ప్రవీణ్రెడ్డి, నాగంపేట్ శేఖర్రెడ్డి, ఎనుగందుల రాజపూర్ణానందం, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.