ఖలీల్వాడి/ కామారెడ్డి/ మాక్లూర్, మే 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ఉ త్సాహంగా తరలిస్తున్నారు. వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దా లు, మందులను అందజేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో శుక్రవారం 44 బృందాలతో 2,830 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్సింగ్ తెలిపారు. 257 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామన్నారు. ఇప్పటి వరకు 4,42,449 మందికి పరీక్షలు నిర్వహించి 61, 129 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని తెలిపారు. నిజామబాద్ జిల్లాలో శుక్రవారం 5,230 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 325 మం దికి కళ్లద్దాలను అందజేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటివరకు 6,40,824 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి, 92,588 మందికి కళ్లద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు.
మాక్లూర్లో కంటి వెలుగు శిబిరాన్నిప్రారంభించిన జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు
మాక్లూర్ మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పేదల సౌకర్యార్థం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి చూపు సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి కళ్లద్దాలు ఇస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సుదర్శనం, ఎంపీడీవో క్రాంతి, ఎంపీటీసీ వెంకటేశ్వర్రావు, మండల కో-ఆప్షన్ సభ్యుడు అహ్మద్, బీఆర్ఎస్ నాయకులు నర్సాగౌడ్, తాజుద్దీన్, కరీం, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.