కామారెడ్డి, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ రహదారులు, బ్రిడ్జిల నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టి, త్వరగా పూర్తి చేయాలని జహీరాబాద్ ఎంపీ,జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ బీబీ పాటిల్ .. ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు పనులు ప్రారంభించని వాటికి టెండర్లను ఆహ్వానించాలని సూచించారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో మాట్లాడారు. పంట పొలాలకు వెళ్లడానికి వీలుగా రహదారులు నిర్మించాలన్నారు. జిల్లాకు ఇచ్చిన మూడు అంబులెన్స్లను వినియోగించాలని సూచించారు.
సమగ్ర సమాచారంతో రావాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. సమావేశంలో ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాచారం ఇవ్వడానికి అధికారులు సమగ్ర సమాచారంతో హాజరు కావాలని సూచించారు. ‘మన ఊరు -మన బడి’ కింద 351పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఇప్పటివరకు 27 పాఠశాలలను ప్రారంభించినట్లు తెలిపారు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో గిరిజన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకురాగా, అందేలా చూస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 1,69,231 మందికి ప్రతి నెలా రూ.35.99 కోట్ల ఆసరా పింఛన్లు అందిస్తున్నామని, కొత్తగా 173 మంది బీడీ టేకేదారులకు పింఛన్లు మంజూరుచేసినట్లు తెలిపారు.
త్వరలో అంగన్వాడీ టీచర్ల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలు ఇస్తున్న సమాచారాన్ని ప్రజాప్రతినిధులకు తెలుపడంలేదని సభ్యులు ప్రశ్నించగా.. సెప్టెంబర్ 2వ వా రంలో అందించే ఉపకరణాల పంపిణీకి ఆహ్వానిస్తామన్నారు. జిల్లాకు కొత్తగా ఏడు విద్యుత్ ఉపకేంద్రాలు మంజూరుకాగా.. పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మెదక్-ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి-రుద్రూర్ వరకు (68 కిలో మీటర్లు)రెండు వరసల రహదారి నిర్మాణానికి రూ.900 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, చంద్రమోహన్, డీఆర్డీవో సాయన్న, జిల్లా అధికారులు, ఎంపీపీలు పాల్గొన్నారు.