నిజామాబాద్ క్రైం,మార్చి 20:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…పారదర్శక నియామకాలతో ఎంతో మందికి మేలు చేసిన సంస్థ. ప్రతిభా పాటవాలే కొలమానంగా భావించి ఉద్యోగాలను భర్తీ చేసింది. మెరిట్ ప్రాతిపదికనే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నది. పైరవీలకు తావులేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నది. సర్కారు ఆదేశాలతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి వేలాది మంది మెరిట్ సాధించే పేదలను కొలువు దరికి చేరుస్తున్నది. ప్రతిభకు పట్టం కడుతూ పోస్టులను భర్తీ చేస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్పీఎస్సీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంతోనే ప్రతిభ ఉన్న మాకు ఉద్యోగాలు వచ్చాయని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. కష్టపడితేనే సర్కారు కొలువు సాధ్యమవుతుందని, ఎలాంటి పైరవీలు చేయనక్కర్లేదని, ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా నిర్వహించడంతోనే మేమంతా కొలువులు సాధించి తమ కలను నెరవేర్చుకున్నామంటున్నారు.
రికమండేషన్ లేకుండానే జాబ్..
హైదరాబాద్లో 2018 సంవత్సరంలో కానిస్టేబుల్గా ఉద్యోగం చేస్తూ ఎస్సై జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాను. ఉద్యోగం చేస్తుండగానే 2020లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా పరీక్ష రాశాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఎస్సైని కావాలనే లక్ష్యంతో చదివాను. ఉద్యోగం సాధించేందుకు నేను ఎవ్వరికీ రూపాయి ఇవ్వలేదు. ఎవరి రికమండేషన్లు పెట్టలేదు. టెస్ట్ పేపర్లతోపాటు ప్రతిరోజూ బుక్స్ చదువుతూ నాకు నేనుగా పరీక్షలు రాస్తూ ఉండేవాడిని. తాను పడిన కష్టానికి తగిన ఫలితంగా ఎస్సై ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని నాల్గో టౌన్లో ఎస్సై-2గా విధులు నిర్వర్తిస్తున్న.
– సీహెచ్ తిరుపతి, ఎస్సై
నిజాయతీగా నియామక ప్రక్రియ..
మెండోరా, మార్చి 20: రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలో మరింత పట్టుదల, ఉద్యోగం సాధించాలనే తపన పెరిగింది. అదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డిప్లామా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ పూర్తిచేశాను. మొదటి నోటిఫికేషన్ సమయంలో నాకు అవకాశం లభించలేదు. రెండో నోటిఫికేషన్లో రాత్రింబవళ్లు చదివి పరీక్ష రాశాను. తక్కువ మార్కులతో ఉద్యోగం సాధించలేకపోయాను. మా తండ్రి మమ్మల్ని వదిలి మంచి చదువు, ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో గల్ఫ్బాట పట్టాడు. అమ్మ బీడీలు చేస్తూ మాకు తోడుగా ఉన్నది. పోచంపాడ్ ప్రభుత్వ క్వార్టర్లో కిరాయికి ఉండేవాళ్లం. మరోసారి నోటిఫికేషన్ వేయడంతో నాలో మరింత పట్టుదల పెరిగి రోజుకు 12గంటల పాటు చదివి పరీక్షలు రాశాను. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈవో పోస్టుకు అర్హత సాధించాను. 2018లో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల శ్రమ, స్వరాష్ట్ర సాధన రెండూ తోడవ్వడంతో ఉద్యోగం సాధించాలనే కల సాకారం అయ్యింది. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం, నేను పడిన కష్టంతోనే ఉద్యోగం సాధించానని నమ్ముతున్నా.
మెరిట్ ఆధారంగానే ఉద్యోగం..
2016లో గ్రూప్-2 పరీక్ష రాశాను. ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. చాలా తక్కువ మార్కుల తేడాతో ఉద్యోగం రాలేదు. 2018లో పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల కాగా మెరిట్ సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాను. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ చదివాను. అమ్మానాన్నలు, స్నేహితులు నిరంతరం ప్రోత్సహించారు. రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఉద్యోగం కోసం తనను ఎవరూ ప్రలోభపెట్టలేదు. టీఎస్పీఎస్సీ మీద నమ్మకం కోల్పోతే విజయావకాశాలను కోల్పోయినట్టే. నిరుద్యోగులకు తల్లిలాంటిది టీఎస్పీఎస్సీ. విజయానికి దగ్గరిదారులు, అడ్డదారులు ఏం ఉండవు. పుకార్లను నమ్మి లక్ష్యాలను వదిలేయకుండా కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్తే కచ్చితంగా ఫలితం అనుకూలంగా వస్తుంది.
– పాశం అశోక్కుమార్, పంచాయతీ సెక్రటరీ, గండి తండా
పైరవీలు లేకుండా..
2016లో వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నాను. నిత్యం 9గంటలు చదివాను. మూడు నెలలపాటు ఉద్యోగ పరీక్షపైనే దృష్టి సారించాను. కష్టపడి చదవడంతో ఉద్యోగం సాధించాను. సబ్ రిజిస్ట్రార్ను అయ్యాను. పైరవీలను ఎప్పుడూ నమ్మలేదు. కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం నాకున్నది. దాంతోనే ఉద్యోగం సాధించాను. టీఎస్పీఎస్సీని నిందించడం సరైన పద్ధతి కాదు. మా తండ్రి చెప్పులు కుడుతూ చదివించారు. ఉద్యోగం సాధించాలనే తపనతో, తల్లిదండ్రుల కండ్లల్లో ఆనందం చూడాలని పక్కా ప్రణాళికతో చదివాను. గ్రూప్-2లో ఉద్యోగం సాధించి కల సాకారం చేసుకున్నాను. ప్రస్తుతం సూర్యపేట్ సబ్రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్నాను.
టీఎస్పీఎస్సీని బద్నాం చేయొద్దు..
నా పేరు చిట్కుల సురేందర్. మాది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామం. సాధారణ వ్యవసాయ కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి, కామారెడ్డి ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాను. ఆ తర్వాత మెదక్ ప్రభుత్వ డైట్ కళాశాలలో డీఎడ్ పూర్తి చేశాను. 2014 తర్వాత ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ నా ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ ఎదురుచూశాను. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బాగా చదివి 2019లో ఎస్జీటీగా ఎంపికయ్యాను. 2019 అక్టోబర్ 30న నాగిరెడ్డిపేట మండలం రాఘవపల్లి తండా పాఠశాలలో ఎస్జీటీగా నియామకం అయ్యాను. పరీక్ష నిర్వహణ అంతా పారదర్శకంగా, పకడ్బందీగా జరిగింది. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు జరగలేదు. టీఎస్పీఎస్సీని బద్నాం చేయడం పద్ధతి కాదు.
టీఎస్పీఎస్సీ అంటేనే నమ్మకం..
పట్టుదలతో చదివి ప్రభుత కొలువు సాధించాను. మూడేండ్లపాటు ఊరిని వదిలి ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే ఉదయం, రాత్రులు, సెలవుదినాల్లో వీలు దొరికినప్పుడల్లా పుస్తకాలతో కుస్తీపట్టి చదివి వ్యవసాయ శాఖలో ఏఈవో ఉద్యోగం సాధించాను. 2013లో అగ్రికల్చర్ కోర్సును పూర్తి చేశా. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రాలేదు. అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపనతో హైదరాబాద్లో ఉంటూ గ్రూపు-2 పరీక్షలకు సిద్ధమయ్యా. తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో ఏఈవో పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించింది. టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు రాసి 2017జనవరిలో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాను. మూడేండ్లపాటు ఊరిని, తల్లిదండ్రులను వదిలి ప్రిపేర్ అవ్వడంతోనే ఉద్యోగాన్ని సాధించగలిగాను. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించిన టీఎస్పీఎస్సీ అంటేనే నమ్మకం.
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించింది..
నా పేరు సల్లూరి శ్రీలత. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాను. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ విడుదల చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుకు దరఖాస్తు చేసుకొని, ఉద్యోగం సాధించాలని కుటుంబసభ్యులు సూచించారు. అప్పటికే ఉద్యోగాల భర్తీలో పారదర్శకత, పైరవీలకు అవకాశం లేని విధంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఘంటాపదంగా ప్రకటించింది. స్వరాష్ట్రంలో పకడ్బందీగా నియామకాలు జరుగుతాయనే పూర్తివిశ్వాసం నాలో కలిగింది. ఈ విశ్వాసం నా ప్రతిభకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. దీంతో కోచింగ్ తీసుకొని ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది గంటల పాటు ప్రిపేర్ అయ్యాను. నాలాగే ఎందరో అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడి చదివారు. మేము నమ్మినట్లే టీఎస్పీఎస్సీ ఎక్కడా ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా, పూర్తి పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది. దీంతో నా కష్టానికి ఫలితం దక్కింది. నాకు పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది.
–శ్రీ లత, జూనియర్ పంచాయతీ కార్యరద్శి, అమీర్నగర్, కమ్మర్పల్లి
లంచాల్లేవ్.. పైరవీల్లేవ్..
ఐదేండ్లపాటు మా ఊరు వదిలి హైదరాబాద్కే పరిమితమయ్యా. ఒక పక్క ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉదయం, రాత్రుళ్లు.. వీలు దొరికినప్పుడుల్లా పుస్తకం పట్టుకొని చదివాను. అటవీశాఖలో బీట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించాను. బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత ఏ మాత్రం కాలయాపన చేయకుండా ఐదేండ్లు హైదరాబాద్లో స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేశాను. గ్రూప్-2 సాధించాలన్న సంకల్పంతో పరీక్షలు సిద్ధమయ్యాను. పలుమార్లు ఆయా ఉద్యోగాలకు ప్రయత్నించాను..కానీ ఫలించలేదు. మరింతగా కష్టపడి చదివాను బీట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాను. వర్ని రేంజ్లో విధులు నిర్వర్తిస్తున్నాను. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా నిర్వహించడంతోనే నాకు ఉద్యోగం వచ్చింది. ఎలాంటి పైరవీ లేకుండా, ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా నాలాంటి పేద కుటుంబానికి చెందిన వ్యక్తికి ఈ జాబ్ వచ్చిందంటే.. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉండడంతోనే.
– ఉప్పరి రాజేందర్, బజార్కొత్తూర్ గ్రామం, నందిపేట్ మండలం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వర్ని
పైరవీలు చేయలే..ప్రతిభ ఆధారంగానే..
కష్టపడి చదువుకున్న వారికి కచ్చితంగా ఫలితం దక్కుతుంది.. అదే ప్రకారం నేను కష్టపడి చదివినందుకే ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించానని నిజాంసాగర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన పట్లోల్ల రేణుక చెబుతున్నారు. నిజాంసాగర్ మండలం ఆరేపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి-గంగ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె. కుమార్తె దివ్యాంగురాలు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైకల్యాన్ని ఎదురించి చదువుల్లో రాణించింది. కష్టపడి చదువుల్లో రాణించి ఎంఏ, బీఈడీ చదివింది. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, బీఈడీ పూర్తి చేసి సిద్దిపేటలో డైట్ చదివింది. 2017లో ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్లో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. ప్రస్తుతం పిట్లం మండల కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నది. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం అంటూ ఏవీలేకుండా 2017 డీఎస్సీ ద్వారా తాను మెరిట్ ప్రకారంగానే ఉద్యోగం సాధించాను.
– పట్లోల్ల రేణుక, ఆరేపల్లి
మెరిట్తో సాధించాను..
నా పేరు పుప్పాల శోభ. గ్రామం పొతంగల్. 2014లో బీఈడీ పూర్తిచేశాను. ఆ తర్వాత ప్రభుత్వం ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగాన్ని సాధించా. 2017లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో పోటీ పరీక్షలో అర్హత సాధించి, 2019లో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మదన్హిప్పర్గా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరాను. అక్కడ మూడేండ్లు ఉపాధ్యాయురాలిగా పనిచేసి గతేడాది సిరికొండ మండలం గడ్కోల్ ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వచ్చాను. కలిసొచ్చిన కాలంగా భావిస్తున్నా.. ఉద్యోగం కోసం ఏండ్లుగా ఎదురుచూసిన వారు ఎందరో ఉన్నారు. చదువు పూర్తి కాగానే ఉద్యోగం నోటిఫికేషన్ రావడం, మెరిట్ సాధించి ఉద్యోగాన్ని పొందడం చాలా సంతోషంగా ఉంది.
–పుప్పాల శోభ, ఉపాధ్యాయురాలు, గడ్కోల్ హైస్కూల్