నిజామాబాద్ క్రైం, మార్చి 18: ఉమ్మడి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారినుంచి ద్విచక్ర వాహనాలతోపాటు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని గౌతంనగర్కు చెందిన సూర్యవంశీ సాయికుమార్, కుమ్మం శ్రావణ్యాదవ్, ఇటుకల మహేశ్, బక్షెట్టి నితిన్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న ఇండ్లల్లో దొంగతనాలు చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద పార్క్చేసిన ద్విచక్రవాహనాలను లక్ష్యంగా చేసుకొని ఎత్తుకెళ్లారు. వీరిపై మొత్తం 8 కేసులు నమోదుకాగా, తప్పించుకు తిరుగుతున్నారు. సీసీఎస్ టీమ్తోపాటు నార్త్ రూరల్ సీఐ ఆధ్వర్యంలో ఈ దొంగల ముఠాను శుక్రవారం చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు తులాలు బంగారు నగలు, వెండి సామగ్రితోపాటు ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ వివరించారు. సాయికుమార్, శ్రావణ యాదవ్పై ఉమ్మడి జిల్లాలో ఏడు పాత కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. దొంగలముఠాను పట్టుకున్న సీసీఎస్, నార్త్ రూరల్ సీఐ నరహరి, మాక్లూర్ ఎస్సై యాదగిరి, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
నిజామాబాద్ నగరంలో ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న మరొకరిని అరెస్టు చేశామని ఏసీపీ కిరణ్కుమార్ తెలిపారు. వన్టౌన్ ఎస్హెచ్వో విజయ్బాబుతో కలిసి నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని నామ్దేవ్వాడకు చెందిన కుస్మ సాయికుమార్ కొంత కాలంగా జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్క్చేసిన బైక్లను చోరీ చేస్తున్నాడు. బోధన్ బస్టాండ్ ఏరియాలో అనుమానాస్పదంగా కనిపించిన సాయికుమార్ను ఎస్సై ఉదయ్ కుమార్ పట్టుకొని విచారించగా ఆరు ద్విచక్ర వాహనాలు దొంగించినట్లు అంగీకరించాడు. నిందితుడి వద్దనుంచి వాహనాలను స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ వెల్లడించారు. ఎస్హెచ్వో విజయ్బాబు ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకున్న ఎస్సై ఉదయ్కుమార్, ఏఎస్సై షకీల్, ఆర్సీఎఫ్ హెడ్కానిస్టేబుల్ అసదుల్లాఖాన్, కానిస్టేబుళ్లను అభినందించారు.