Kamareddy | రాజంపేట్, మార్చి 13: వృద్ధాప్యంలో తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సిన కూతుళ్లు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టారు. కన్న తండ్రిని ఇంట్లో ఉంచి కాల్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట్కు చెందిన కొప్పుల ఆంజనేయులు(70)కు భార్య, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు పెండ్లి చేసి పంపించాడు. గ్రామంలో ఉన్న నాలుగెకరాల భూమి కోసం కుటుంబంలో చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.
ఆస్తి కోసం ఇద్దరు కూతుళ్లు రాజంపేట్కు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. దీన్ని భరించలేని ఆంజనేయులు కుమారుడు కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు.. భార్య, బిడ్డలు సరిగ్గా చూసుకోవడం లేదని ఆంజనేయులు రెండో పెండ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి తన ఇంటి సమీపంలోని మరో చిన్న ఇంట్లో ఉంటున్నాడు. ఆంజనేయులు చిన్న కూతురు బిడ్డ పెండ్లి విందు ఆదివారం కామారెడ్డిలో జరిగింది.
ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు ఇద్దరు పెద్ద కూతుళ్లు కలిసి తండ్రిని ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. ఏం జరిగిందో ఏమో ఆ ఇంట్లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీని తెప్పించి ఇంటిని కూల్చేశారు. మాంసపు ముద్దగా మారిన మృతదేహాన్ని కామారెడ్డి దవాఖానాకు తరలించారు. తండ్రిని కూతుళ్లే చంపి దహనం చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయమే తండ్రిని చంపి తాళం వేసి వెళ్లారని, రాత్రి వచ్చాక పథకం ప్రకారమే ఇంటిని కాల్చేశారని చెప్తున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై గ్రామస్థులు మండిపడుతున్నారు. రాత్రి కి రాత్రే జేసీబీని తీసుకొచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లడంపై అనుమానం వ్యక్తం చేస్తూ బంధువులు, కుల పెద్దలు, గ్రామస్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు.