హరారే: వరుసగా రెండు సిరీస్ ఓటముల తర్వాత భారత టీ20 జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం హరారే వేదికగా జరిగిన తొలి పోరులో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. తద్వారా ఈ ఫార్మాట్లో ఏడు ఓటముల తర్వాత గెలుపు రుచిని ఆస్వాదించింది. జింబాబ్వే నిర్దేశించిన 126 పరుగుల స్వల్ప ఛేదనలో వైభవ్ సూర్యవంశీ (19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 50) మెరుపులకు తోడు ఇషాన్ కిషన్ (35) రాణించడంతో భారత్.. 13.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో రెండు నెలల క్రితం భారత టీ20 సారథ్య పగ్గాలు అందుకున్న అయ్యర్ టీమిండియా సారథిగా తొలి విజయాన్ని అందుకున్నాడు. తొలుత భారత బౌలర్లు కట్టడిచేయడంతో జింబాబ్వే 125/7 స్కోరు మాత్రమే చేసింది. వెస్లీ మధెవెరె (34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో 39) టాప్ స్కోరర్. బంతితో రాణించిన మయాంక్ (2/18)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య శనివారం రెండో టీ20 జరుగుతుంది.
ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో జాతీయ జట్టులోకి వచ్చిన వైభవ్.. ఇంగ్లండ్ సిరీస్లో నిరాశపరిచినా తనకు అచ్చొచ్చిన హరారే పిచ్పై జింబాబ్వే బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడే జరిగిన అండర్-19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ (80 బంతుల్లో 175 రన్స్తో)లో దుమ్మురేపిన వైభవ్.. ఫస్ట్ టీ20లో అదే జోరును కొనసాగించాడు. ఎంగరవ వేసిన రెండో ఓవర్లోనే రెండు సిక్స్లు, బౌండరీతో 20 రన్స్ దండుకున్నాడు. అభిషేక్ (1) విఫలమైనా వన్డౌన్ బ్యాటర్ ఇషాన్తో కలిసి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఎవాన్స్ బౌలింగ్లో 4,6 బాదిన ఈ బీహార్ చిన్నోడు.. ముజరబాని 5వ ఓవర్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు దంచాడు. మరో ఎండ్లో ఇషాన్.. న్యామహురీ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. పవర్ ప్లే తర్వాత ఎంగరవ విసిరిన ఓవర్లో మొదటి బంతికి రెండు రన్స్ తీసి 18 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతడికి ఇదే తొలి ఫిఫ్టీ. అయితే ఆ తర్వాతి బంతికే అతడు నిష్క్రమించాడు. వైభవ్ ఔటైనా శ్రేయస్ (28 నాటౌట్)తో కలిసి మూడో వికెట్కు 46 రన్స్ జోడించిన ఇషాన్ విజయానికి 12 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. అయితే కెప్టెన్ శ్రేయస్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (6 నాటౌట్) లాంఛనాన్ని ముగించారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత యువ పేసర్ల ధాటికి తొలి బంతి నుంచే విలవిల్లాడింది. రీఎంట్రీలో మయాంక్ ఫస్ట్ బాల్కే బెనెట్ (0)ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. ప్రిన్స్, అరంగేట్ర పేసర్ అశోక్ శర్మ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేయడంతో ఆతిథ్య జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 7 ఓవర్లకు 31/3తో నిలిచిన జింబాబ్వే.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆదుకుంటాడనుకున్న సారథి సికందర్ రజా (4)ను దూబే పెవిలియన్కు పంపా డు. బర్ల్ (26), మరుమణి (27) సాయంతో మధెవెరె ఆదుకోవడంతో జింబాబ్వే ఆమాత్రం స్కోరైనా సాధించింది.
జింబాబ్వే: 20 ఓవర్లకు 125/7 (మధెవెరె 39, బర్ల్ 26, మయాంక్ 2/18, ప్రిన్స్ 2/19):
భారత్: 13.2 ఓవర్లకు 126/3 (వైభవ్ 50, ఇషాన్ 35, ముజరబాని 2/26, ఎంగరవ 1/30)..