బీబీపేట్ : రెండున్నర దశాబ్దాల తరువాత ఏడు గ్రామాల ఆయకట్టుకు నీరందించే చెరువు ప్రసుత్త భారీవర్షాలతో జలకళను సంతరించుకున్నది. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం పెద్ద చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. సుమారు 510 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ఏడుగ్రామాలకు 2వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందిస్తున్నది. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ బుధవారం స్థానిక సర్పంచ్ లక్ష్మీసత్యనారాయణ, ప్రజాప్రతినిధులతో కలిసి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..26 సంవత్సరాల తర్వాత వరుణ దేవుడు కరుణించి ఈ పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండడంతో రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నామని అన్నారు.
రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి ప్రతి ఏటా నిండుకుండలా ఉండేలా చేస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి వారి మదిలో నిలుస్తామన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్ చెరువకు సంబంధించిన ఐదు తూములు పటేల్ తూము, ఏనుగుల తూము, మైసమ్మ తూము, సౌడు తూము, ఇలాయి తూములను పూర్తి స్థాయిలో పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని విప్నకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ బాలామణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు , మండల కన్వీనర్ నాగరాజ్గౌడ్, టీఆర్ఎస్ మండల, గ్రామ శాఖల అధ్యక్షులు, రైతుబంధు కన్వీనర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు