నిజాంసాగర్, మార్చి 20: రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి నిజాంసాగర్ పైలట్ మండలంగా ఎంపిక చేసి, మొత్తం 1,298 దళిత కుటుంబాలకు యూనిట్లు అందజేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. సోమవారం నిజాంసాగర్ మండల పరిషత్తు కార్యాలయంలో జీపీ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా లేదా వారి విజయగాథలను సేకరించి కథనాలను రూపొందించాలని ఆదేశించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో దళితబంధు పథకం ద్వారా అందుకున్న యూనిట్లు, గతంలో వారు చేసిన పని, ప్రస్తుతం దళితబంధు పథకం ద్వారా ఏ విధంగా ఉపాధి పొందుతున్నారు.. ప్రతిరోజూ ఎంత సంపాదిస్తున్నారు, గతంలో, ప్రస్తుతం కుటుంబం ఏ విధంగా ఉంది.. తదితర వివరాలను సేకరించాలని సూచించారు. వారి విజయగాథలపై కథనం రూపొందించి ఇతర జిల్లాల్లో మాదిరిగా దళితబంధు వివరాలతో ఓ పుస్తకాన్ని తయారు చేస్తున్నారని తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో దళితబంధు పథకం అందుకున్న కుటుంబాల వద్దకు వెళ్లాలని ఆదేశించారు. అనంతరం నర్సింగ్రావ్పల్లి గ్రామంలో దళితబంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న చేపల పెంపకం యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, పశు సంవర్ధక శాఖ ఈడీ భరత్, జిల్లా రవాణాశాఖ అధికారిణి శ్రీవాణి, ఎంపీడీవో నాగేశ్వర్, తహసీల్దార్ నారాయణ, దళితబంధు మండల కన్వీనర్ విఠల్, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది నరేశ్, ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు.